ఏపీని భయపెడుతున్న ‘వార్ధా’: చంద్రబాబు గల్ఫ్ ట్రిప్ రద్దు
విశాఖపట్నం: వార్ధా పెను తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన గల్ఫ్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఏపీపై వార్దా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేగాక, నోట్ల రద్దు అంశాలను సమర్థంగా ఎదుర్కోవాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని నిర్ణయించారు. తుఫాను నేపథ్యంలో విపత్తు నిర్వహణ, ఆర్థికశాఖ అధికారులు, బ్యాంకర్లతో శనివారం ఉదయం సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
రెండో హెచ్చరిక జారీ: కావలి వద్ద తీరందాటనున్న వార్ధా
అండమాన్ తీరం వద్ద ఏర్పడిన 'వార్దా' తుఫాను కోస్తాంధ్రలోని కావలి వద్ద తీరాన్ని దాటే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ప్రస్తుతమిది మచిలీపట్నానికి 870 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. డిసెంబర్ 12వ తేదీ రాత్రికి ఇది కావలి-బిట్రగుంట సమీపంలోనే తీరాన్నిదాటే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.
అయితే తీరాన్ని దాటకముందే దీని తీవ్రత క్రమంగా తగ్గే అకాశముందని వాతావరణశాఖ భావిస్తోంది. ప్రస్తుతమిది పశ్చిమ వాయువ్యదిశగా గంటకు 22 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని వాతావరణశాఖకు చెందిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతంస ముద్రంలోనే పెనుతుపానుగా మారిన వార్దా ప్రభావంతో ఆపరిసర ప్రాంతాల్లో గంటకు వంద నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.
కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. మరో వైపు 11వతేదీ రాత్రి నుంచి ఓ మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ శాఖ స్పష్టం చేసింది. కోస్తాంధ్రలోని మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ప్రధాన రేవు పట్టణాలకు రెండో హెచ్చరిక జారీ చేశారు. తుఫాను కారణంగా ఏపీలోని పలు ప్రభావిత ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.