దొనకొండ కు రూట్ క్లియర్: 2,450 ఎకరాల భూమి గుర్తింపు : ప్రభుత్వ ఆలోచన ఇదే..!!
Recommended Video
దొనకొండ కొద్ది రోజులుగా ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పేరు. అమరావతి గురించి మంత్రి బొత్సా చేసిన వ్యాఖ్యలతో మరో సారి దొనకొండ అంశం తెర మీదకు వచ్చింది. అయితే, ప్రభుత్వం మాత్రం దొనకొండ విషయంలో కీలక అడుగులు వేస్తోంది. అమరావతిలో రాజధాని ఉంటుందా..ఉండదా అనే దానికి మాత్రం స్పష్టత ఇవ్వటం లేదు. దీని పైన సందేహాలు..అంచనాలు కొనసాగుండగానే దొనకొండ పైన ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం వెనక్కు తగ్గటం లేదు. ఏపీలో అన్ని ప్రాంతాలు డెవలప్ చేయటమే తమ లక్ష్యం అని చెబుతోంది. ఇప్పటికే దొనకొండలో 2,450 ఎకరాల భూమిని ప్రభుత్వం గుర్తించింది. దీని ద్వారా గతంలో కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసినా..ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అక్కడ కీలక నిర్ణయాలు అమలు దిశగా కార్యాచరణ సిద్దం చేస్తోంది.
దొనకొండకు కొత్త కళ..
దొనకొండ వైసీపీ ప్రభుత్వం రాజధానిగా చేయబోతోందంటూ కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. రాష్ట్ర విభజన సమయం నుండి ఈ ప్రచారం ఉంది. రాజధాని అంశం మీద అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామక్రిష్ణన్ కమిటీ సైతం ప్రతిపాదించిన రాజధాని ప్రాంతాల్లో దొనకొండ ఒకటి. అయితే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తుళ్లూరు ప్రాంతాన్ని రాజధానిగా ఖరారు చేసారు. అమరావతిగా పేరు ప్రకటించారు. ఇక, ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి వచ్చింది. తాజాగా మంత్రి బొత్సా అమరావతి గురించి చేసిన వ్యాఖ్యలతో మరో సారి రాజధాని గురించి రాష్ట్ర వ్యాప్తంగా చ్చ మొదలైంది. అదే సమయంలో అమరావతి నుండి రాజధాని తరలింపు పైనా అనేక ప్రచారాలు సాగుతున్నాయి. దొనకొండ రాజధాని చేస్తారంటూ కొందరు ప్రచారం మొదలు పెట్టారు. దీంతో అక్కడి భూమలకు ధరలు పెరిగాయని..రియల్టర్లు అక్కడ భూముల మీద ఫోకస్ చేసారని చెబుతున్నారు. దీంతో..ప్రభుత్వం అసలు విషయం బయట పెట్టింది. దొనకొండ గురించి ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగా అధికారులు నివేదికలు సిద్దం చేసారు. ఇదే ప్రకటిస్తే దొనకొండకు కొత్త కళ రానుంది.
పారిశ్రామిక హబ్గా..
రాజధాని కాదు..దొనకొండ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్గా చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సమాచారం. ఇప్పటికే ఇక్కడ పారిశ్రామీకరణ కోసం దాదాపు 2,450 ఎకరాల భూమిని ప్రభుత్వం గుర్తించి అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను అధ్యయం చేస్తోంది. దొనకొండ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్గా ఏర్పాటుచేసేందుకు ఐదువేల ఎకరాలు అవసరం అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఆ మేరకు భూమిని సమీకరించే అవకాశాలు కూడా ఉన్నాయని అనుకుంటోంది. వాస్తవానికి దొనకొండ ప్రాంతాన్ని గతం నుంచీ పారిశ్రామిక హబ్గా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. ద్పీపకల్ప ప్రాంత పారిశ్రామిక కారిడార్గా దీన్ని అభివృద్ధి చేయాలని కేంద్రం వద్ద కూడా ఒక ప్రతిపాదన ఉంది. గతంలో ఈ ప్రతిపాదన కింద ఐదు వేల ఎకరాలను సేకరించాలని అనుకున్నారు. చైనాకు సంబంధించిన కంపెనీలతోను మాట్లాడారు. అక్కడొక నిర్మాణ రంగ నగరాన్ని ఏర్పాటుచేయాలన్నదానిపై కొంత చర్చలు జరిగాయి. నిర్మాణ రంగంలో ఉపయోగించే పలు రకాల సామాగ్రికి చైనా ప్రసిద్ధి. అయితే ఆ ప్రాజెక్టుల వ్యవహారాలు పట్టాలకెక్కలేదు. ఇప్పుడు ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లి, మొత్తంగా ఐదువేల ఎకరాల వరకు భూమిని గుర్తించి పారిశ్రామిక హబ్ ఏర్పాటు ప్రక్రియపై ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం.
కేంద్రానికి నివేదికతో సంయుక్తంగా..
దొనకొండ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్ గా తీర్చి దిద్దేందుకు గతంలోనే కేంద్రానికి ప్రతిపాదనలు అందాయి. ఇప్పుడు సరి కొత్త పారిశ్రామిక పాలసీని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దొనకొండ ప్రాంతంలో.. ప్రభుత్వ భూములు భారీగా ఉండడం...అదే సమయంలో రామాయపట్నం పోర్టు వస్తే దానికి కూడా దగ్గరగా దొనకొండ ఉండడం కలిసొచ్చే అంశాలవుతాయని భావిస్తున్నారు. నూతన పారిశ్రామిక విధానం రూపొందించాక, దొనకొండ ఇండస్ర్టియల్ హబ్పై మరింత దృష్టిపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రెండు, మూడు నెలల్లో నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకురానున్నారు. ఆ విధానం వచ్చాక దానికి అనుగుణంగా దొనకొండ పారిశ్రామిక హబ్ విషయంలో ముందడుగు వేయాలని నిర్ణయించారు. అదే సమయంలో కేంద్రంతో కూడా మాట్లాడి...పారిశ్రామిక హబ్ ఏర్పాటు విషయంలో సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి సాయం చేస్తామని కేంద్రం గతంలోనే హామీ ఇచ్చిందని, ఆ మేరకు సాయం చేయాలని కోరతామని అధికారులు చెబుతున్నారు. ఏపీ మొత్తం డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే భారీ ప్రణాళికలతో దొనకొండ పారిశ్రామిక హబ్ పైన చర్చలు సాగుతున్నాయి.