20న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం: హైపవర్ కమిటీ రిపోర్టుపై చర్చ: మూడు రాజధానులకు ఆమోదం..!
ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల పైన అధికారిక నిర్ణయం దిశగా ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే జీఎన్ రావు..బోస్టన్ కమిటీలు ఇచ్చిన నివేదిక పైన ప్రభుత్వం హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ రెండు సార్లు సమావేవమైంది. ఈ నెల 17న ప్రభుత్వానికి హైపవర్ కమిటీ నివేదిక అందించనుంది. ఆ వెంటనే 18న ఏపీ కేబినెట్ ప్రత్యేకంగా ఇదే అంశం పైన సమావేశమై..కమిటీ నివేదికలోని సిఫార్సు లకు ఆమోదం తెలపనుంది.
ఇక, ఈ నెల 20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సమావేశం ద్వారా సభలోనే అన్ని పార్టీలు..ఎమ్మెల్యేలు మూడు రాజధానుల పైన ప్రభుత్వం సుదీర్ఘ వివరణ ఇవ్వనుంది. దీని కోసం ఉభయ సభల సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఆ సమావేశంలోనే ముడు రాజధానులకు అనుకూలంగా తీర్మానం ప్రవేశ పెట్టి అధికారికంగా ఆమోద ముద్ర వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మధ్యలో ఎటువంటి ఇబ్బందులు లేకపోతే..ఈ నెల 20న అసెంబ్లీలో మూడు రాజధానులకు ఆమోదం లభించనుంది.

18న కేబినెట్ సమావేశంలో ఆమోదం..
ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ ఈ నెల 17న ముఖ్యమంత్రి జగన్ కు నివేదిక ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే రెండు సార్లు సమావేశమైన ఈ హైపవర్ కమిటీ జీఎన్ రావుతో పాటుగా బోస్టన్ కమిటీ ఇచ్చిన నివేదికలపైన అధ్యయనం చేసింది. అదే సమయంలో జిల్లాల వారీగా చేపట్టాల్సిన డెవలప్ మెంట్ పైన నివేదికలు సిద్దం చేస్తోంది. ఇక, 13న జరిగే సమావేశంలో రాజధాని రైతులకు ఏ రకమైన హామీ లు ఇవ్వాలి..వారికి ఏ రకంగా ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకోవాలనే దాని పైన చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఉద్యోగులను విశాఖకు తరలించేందుకు కొన్ని ప్రతిపాదనలు సిద్దం చేయనున్నారు. ఆ తరువాత 17వ తేదీన నివేదిక సమర్పించనుంది. దీంతో, ఆ వెంటనే 18న కేబినెట్ సమావేశంలో ఈ కమిటీ నివేదికకు ఆమోద ముద్ర వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

20న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం..
18న జరిగే కేబినెట్ సమావేశంలో హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదం లభించిన వెంటనే..మరింత సమయం ఇవ్వకూడదని ప్రభుత్వం భావిస్తొంది. దీంతో..ఈ నెల 20 తేదీన ప్రత్యేకంగా శాసనసభ నిర్వహించా లని నిర్ణయించింది. ఈ సమావేశంలో హైపవర్ కమిటీ నివేదిక ను సభ లో ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం...దీని పైన చర్చ చేయనుంది. అధికార పార్టీ నుండి మూడు ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రభుత్వ ప్రతిపాదనకు మద్దతుగా ఎవరు మాట్లాడాలో ఇప్పటికే ఖరారు చేస్తున్నారు.
అదే సమయంలో టీడీపీ సైతం తమ అభిప్రాయాలు భిన్నంగా చెబుతుందో..లేక అధినేతగా ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు అమరా వతికి మద్దతుగా మాట్లాడుతారో అనేది ఆసక్తి కరంగా మారింది. రాజధాని సహా రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణ పైశాసన సభలో చర్చించనున్న ప్రభుత్వం తమ ఆలోచనలను సభ ద్వారా వివరించనున్నారు. జనసేన ఎమ్మెల్యే ఇప్పటికే ప్రభుత్వ ప్రతిపాదనలకు మద్దతు ప్రకటించారు.

సమావేశంలో అధికారిక ఆమోదం..
ఇక, ఈ నెల 20న జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం మూడు రాజధానుల అంశం పైన తీర్మానం సైతం ప్రతిపాదించాలని భావిస్తోంది. దానికి సంబంధించి అదే రోజు సభలో ప్రాతినిధ్యం ఉన్న పార్టీల ప్రతినిధులు తమ అభిప్రాయాలు చెప్పనున్నారు. ఇందు కోసం శాసనసబ..మండలితో కలిసి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాసనసభలో వైసీపీకి మెజార్టీ ఉండగా.. మండలిలో టీడీపీకి మెజార్టీ ఉంది.
దీంతో..ఉమ్మడి సభ ఏర్పాటు ద్వారా ప్రభుత్వ తీర్మానం ఆమోదించేలా ప్రభుత్వం వ్యూహాలు సిద్దం చేస్తోంది. ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఈ నెల 20వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ సమావేశ ద్వారా మూడు రాజధానుల ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications