పోలవరంపై కీలక నిర్ణయం - వెంటనే పూర్తి చేసేలా : సీఎం జగన్ ఆమోదంతో..!!
పోలవరం ఎగువ కాఫర్ డ్యాంకు ప్రమాదం వాటిల్లకుండా కొంత మేర ఎత్తు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాఫర్ డ్యాం ఎత్తు ఒక మీటరు మేర రెండు మీటర్ల వెడల్పున పెంచనున్నారు. భారీ వరదను ఎదుర్కొనేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రాత్రికి దీనిని పూర్తి చేసేలా నిర్ణయించారు. ఎగువ కాఫర్ డ్యాం 2,480 మీటర్ల పొడవునా ఒక మీటరు ఎత్తు, 2 మీటర్ల వెడల్పుతో ఎత్తు పెంచే పనులు మొదలు పెట్టారు. పోలవరం వద్ద ఎగువ కాఫర్ డ్యాం సమీపంలో 37.8 మీటర్ల స్థాయిలో గోదావరి నీటిమట్టం ఉంది.
ఎగువ కాఫర్ డ్యాం మరో ఆరు మీటర్ల ఎత్తు ఉంటుంది. ఎగువ నుంచి మరింత పెద్ద ఎత్తున వస్తున్న ప్రవాహాన్ని ఎలా ఎదుర్కొవాలనేది చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఎగువ కాఫర్ డ్యాం 28 లక్షల క్యూసెక్కుల సామర్థ్యాన్ని తట్టుకునేలా నిర్మించారు. 30 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే ఎగువ కాఫర్ డ్యాం పై నుంచి దిగువకు ప్రవహించే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలోపెట్టుకొని ఒక మీటరు మేర ఎగువ కాఫర్ డ్యాం పొడవునా 2 మీటర్ల వెడల్పుతో ఎత్తు పెంచాలని నిర్ణయించారు. జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.
అధికారులతో సమీక్షించారు. నీరు ఎగువ కాఫర్ డ్యాం దాటి రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ పనులు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఎగువ కాఫర్ డ్యాం 42.5 మీటర్ల ఎత్తున నిర్మించారు. అందులో 41 మీటర్ల మేర మాత్రమే కోర్ ఉంది. ఆ పైన రాళ్లతోనే నిర్మించారు. ఇప్పుడు ఆ పైన కూడా రాళ్లతోనే ఎత్తు పెంచబోతున్నారు. ఒక వేళ 30 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే ఎగువ కాఫర్ డ్యాం పై నుంచి నీరు ప్రవహించకుండా అడ్డుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. పోలవరం పరిస్థితిపై, ఎగువ కాఫర్ డ్యాం అంశంపై ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. ఎగువ కాఫర్ డ్యాం ఎత్తు పెంచే ప్రతిపాదనకు సీఎం ఆమోదం ఇచ్చినట్లు సమాచారం.