ఎన్నికల కసరత్తులో సీఎం జగన్ కీలక నిర్ణయం..!!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి - సాధారణ ప్రజల మధ్య నేరుగా సంబంధాల కోసం కొత్త పథకం తీసుకొస్తున్నారు. గడపగపడకు ప్రభుత్వం పేరుతో పథకాల లబ్ది దారుల ఇంటికి మంత్రులు - ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. దీనిని ముఖ్యమంత్రి జగన్ స్వయంగా సమీక్షిస్తున్నారు. ఇదే సమయంలో..మరో కొత్త కార్యక్రమం ప్రారంభించాలని ముఖ్యమంత్రి దాదాపుగా నిర్ణయించారు. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటుగా ముఖ్యమంత్రికే నేరుగా లబ్దిదారులు - సాధారణ ప్రజలు తమ సమస్యలను చెప్పుకొనే అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
దీని కోసం నేరుగా సీఎం కార్యాలయం పర్యవేక్షణలో ఒక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైనా నేరుగా ఫిర్యాదు, సమాచారం ఇవ్వటం కోసం ఒక నెంబర్ ను ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమం పేరును "జగనన్నకు చెబుదాం" గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో లబ్ది దారులకు నేరుగా ఫోన్లు చేసి వారికి అందుతున్న పథకాలను అందించటంతో పాటుగా వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. ఇప్పటికే ప్రతీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే..పరిశీలకుడు..ఐప్యాక్ ప్రతినిధి..సోషల్ మీడియా వాలంటీర్ తో పాటుగా సచివాలయాల సిబ్బంది లబ్ది దారులతో మమేకం అవుతున్నారు. వారి నుంచి తానే స్వయంగా మట్లాడటం .. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవటం ద్వారా క్షేత్ర స్థాయిలో పథకాల అమలు మరింత పక్కాగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
దీంతో పాటుగా స్వయంగా సీఎం లబ్దిదారులతో మాట్లాడటం ద్వారా సాధారణ ప్రజల్లోనూ సానుకూలత వస్తుందని భావిస్తున్నారు. సాధారణ ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోనున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల గురించి ఇప్పటికే అనేక మార్గాల నుంచి ప్రజల్లో ఏ మేర సానుకూలత ఉందనే కోణంలో సమాచారం సేకరిస్తున్నారు. ఎన్నికల కసరత్తులో భాగంగా ఈ నిర్ణయం కీలకం కానుంది. దీంతో పాటుగా వారి నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించే విధంగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వనున్నారు. ఈ మొత్తం నిర్వహణ కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. త్వరలోనే ఈ కార్యక్రమం అధికారికంగా ప్రారంభం కానుంది. అదే విధంగా జిల్లాల పర్యటనలకు సీఎం జగన్ సిద్దం అవుతున్నారు.