‘ఏపీలో గ్రామ వాలంటీర్ల తొలగింపు -35ఏళ్లు దాటితే వేటు’పై జగన్ సర్కారు వివరణ -అసలేమైందంటే..
ఆంధ్రప్రదేశ్లో గ్రామ స్వరాజ్య స్థాపన కోసమే వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ సర్కారు ఘనంగా చెప్పుకుంటుండగా, అసలా వాలంటీర్ల వ్యవస్థే లేకుండా పోతోందంటూ కొద్ది గంటలుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మెయిన్ స్ట్రీమ్, సోషల్ మీడియాల్లో వాలంటీర్లకు సంబంధించిన వార్తలు కలకలం రేపుతున్నాయి. దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఎట్టకేలకు ఒక అధికారిక ప్రకటన జారీచేసింది..

వాలంటీర్లకు భారీ షాక్
‘‘ఏపీలో గ్రామ, వార్డు వలంటీర్లపై పిడుగుపాటు.. 35 ఏళ్లు నిండిన వలంటీర్లు ఇక ఇంటికే.. ఈ మేరకు కమిషనరేట్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.. అన్ని జిల్లాలో వందల కొద్దీ వలంటీర్లకు ఉద్వాసనే.. మొత్తంగా వాలంటీర్ల సేవలు మూణాళ్ల ముచ్చటగా ముగిసిపోనున్నాయి..'' అంటూ కొద్ది గంటలుగా సోషల్ మీడియా హోరెత్తిపోతున్నది. వయసు 35 ఏళ్లు నిండిన వాలంటీర్లను తొలగించబోతున్నారంటూ ఓ పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా ఈ సమాచారం వైరల్ కావడంతో వలంటీర్లు, వారి కుటుంబీకులు ఆందోళన చెందారు. చివరికి..

35 ఏళ్లకే తొలగింపు అవాస్తవం
వాలంటీర్ల తొలగింపు వార్తలు, దానిపై సోషల్ మీడియాలో షేరవుతోన్న సమాచారంపై జగన్ సర్కారు ఎట్టకేలకు స్పందించింది. తాడేపల్లిలోని సచివాలయ శాఖ కమిషనర్, డైరెక్టర్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 35 ఏళ్లు నిండిన వలంటీర్లను తొలగిస్తున్నారన్న వార్తలో ఏమాత్రం నిజం లేదని అధికారులు స్పస్టం చేశారు. అసలేం జరిగిందో ఆ ప్రకటనలో వివరించారు..

ఆరుగురిని మాత్రమే తీసేశాం..
‘‘అందరికీ తెలియజేయునది ఏమనగా.. 35 ఏళ్లు నిండిన వాలంటీర్లను తొలగిస్తున్నామంటూ ఓ పత్రిక తప్పుడు వార్తను ప్రచురించింది. ఆ కథనం వల్ల వాలంటీర్లు అనవసరమైన భయాందోళనలకు గురయ్యారు. నిజానికి మేం ఇచ్చిన ఉత్తర్వులు 35 ఏళ్లు పైబడినవాళ్లను తొలగించాలని కాదు. నిబంధనలకు విరుద్ధంగా వాలంటీర్ పోస్టులకు ఎంపికైన ఆరుగురిని మాత్రమే తొలగిస్తూ ఆదేశాలిచ్చాం. ఆ ఆరుగురు తప్ప రాష్ట్రంలో మిగిలిన వాలంటీర్లెవరినీ తొలగించలేదు. నిబంధనల ప్రకారం రిక్రూట్ అయిన వాలంటీర్లెవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'' అని సచివాలయ శాఖ అధికారులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications