AP Govt: ఏపీలో 11,600 ఉద్యోగులపై పెండింగ్ కేసులు..! సర్కార్ కీలక ఆదేశాలు..!
ఏపీలో ఉద్యోగుల విషయంలో ఇవాళ కూటమి ప్రభుత్వం (AP Govt) సంచలన ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలోని 31 ప్రభుత్వ శాఖల్లో క్రమశిక్షణ ఉల్లంఘించిన కేసులు (Disciplinary Cases) ఎదుర్కొంటున్న 11600 మంది ఉద్యోగులపై (Employees) కొరడా ఝళిపించేందుకు సిద్ధమవుతోంది. వీరిపై ఇప్పటికే పెండింగ్ లో ఉన్న 7827 కేసుల సంగతి తేల్చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వీరిపై కేసుల విచారణను ముమ్మరం చేసేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న 11 వేలకు పైగా ఉద్యోగుల క్రమశిక్షణ కేసుల్లో అత్యధికంగా రవాణా, రోడ్లు, భవనాల శాఖలో 1,482 కేసులు ఉన్నాయి. అలాగే హోం శాఖలో 1,423 కేసులుండగా.. రెవెన్యూ శాఖలో 1,226 కేసులు, వైద్య, ఆరోగ్య శాఖలో 574 కేసులు, పురపాలక శాఖలో 475 కేసులు ఉన్నాయి. వీటిపై ప్రభుత్వం ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే విచారణను నిర్ణీత కాల పరిమితిలోగా పూర్తి చేసేందుకు వీలుగా షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఉద్యోగులపై క్రమశిక్షణా కేసులను పర్యవేక్షించేందుకు అన్ని శాఖల్లో నోడల్ అధికారులను నియమించాలని సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఈ కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు తరచుగా సమీక్షించాలని నిర్ణయించారు.

ప్రతి కేసును ఆన్లైన్లో ట్రాక్ చేసే విధంగా ఈ-విజిలెన్స్ వ్యవస్థను పూర్తిస్థాయిలో వాడుకోబోతున్నారు. ఇలా జులై 8లోగా అన్ని శాఖల్లో నోడల్ అధికారుల నియామకం పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అనంతరం జులై 10లోగా పాత క్రమశిక్షణా కేసులను ఈ-విజిలెన్స్లో మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. జులై 14లోగా విచారణ అధికారుల సమీక్ష పూర్తి చేయాలన్నారు. జులై 17న జిల్లా కలెక్టర్ల స్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. జులై 18లోగా పాత కేసుల పూర్తి వివరాలను ఈ-విజిలెన్స్ పోర్టల్లో నమోదు చేస్తారు. జులై 21న అన్ని శాఖాధిపతులతో తొలి సమీక్ష నిర్వహిస్తారు. జులై 28న కార్యదర్శుల స్థాయిలో సమీక్ష ఉంటుంది. చివరిగా ఆగస్టు 4న సీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి ఈ కేసుల సంగతి తేలుస్తారు.














Click it and Unblock the Notifications