ఇంటర్ ఫస్ట్ఇయర్ పరీక్షలు రద్దు..సెలవుల్లో మార్పు..!!
ఏపీలో ఇంటర్ విధానంలో కీలక మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. సిలబస్ తో పాటుగా పరీక్ష ల నిర్వహణలో సంస్కరణల పైన ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. సీబీఎస్ఈ తరహాలో రెండేళ్ల కోర్సులో ఒక్కసారే పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి ఏడాది పరీక్షలను ఇంటర్నల్గా నిర్వహించి రెండో సంవత్సరం యథాతథంగా కొనసాగించనుంది. కొత్తగా ఎంబైపీసీ (M.Bi.P.C) గ్రూపును ప్రవేశపెట్టనుంది. ఇంటర్ సిలబస్లోను మార్పులకు ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వం కసరత్తు
ఏపీలో కూటమి ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యా విధానం పైన ఫోకస్ చేసింది. సిలబస్ తో పాటుగా పరీక్షల నిర్వహణలోనూ మార్పుల దిశగా ఆలోచన చేస్తోంది. ఇందు కోసం సీబీఎస్ఈ తరహాలో రెండేళ్ల కోర్సుకు ఒక్కసారే పబ్లిక్ పరీక్షలు నిర్వహించడంపై అభిప్రాయ సేకరణ చేస్తోంది. సీబీఎస్ఈలో 11వ తరగతికి పబ్లిక్ పరీక్షలు ఉండవు. 12వ తరగతికి మాత్రమే పరీక్షలు ఉంటాయి. దీంతో, ఇంటర్ పరీక్షల్లోనూ ఇదే విధానం అమలు పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జాతీయ ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు కూడా 12వ తరగతి మార్కులనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దీంతో ఇంటర్ రెండో సంవత్సరంలో పబ్లిక్ పరీక్షలుంటే చాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. ఈమేరకు ఫస్టియర్లో పబ్లిక్ పరీక్షలు రద్దు చేస్తూ.. ఇంటర్నల్ పరీక్షలకు మాత్రమే పరిమితం కావాలని నిర్ణయించింది.

ప్రజాభిప్రాయ సేకరణ
కాగా, చాలా కాలంగా ఉన్న ఈ విధానంలో మార్పుల పైన ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకూడదని ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం ప్రజాభిప్రాయ సేకరణకు నిర్ణయించారు. నేటి నుంచి ఈ నెల 26వరకు దీనిపై అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించింది. ఒక్కసారే పరీక్షలు పెట్టడం వల్ల విద్యార్థులకు చదువుకునేందుకు ఎక్కువ సమయం లభిస్తుందని భావిస్తున్నారు. దీంతో, ఒత్తిడి తగ్గి ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే వచ్చే ఏడాది నుంచి సిలబస్ లో భారీగా మార్పులు తేవటం పైన ఆలోచన జరుగుతోంది. విద్యా సంవత్సరంలోనూ కీలక మార్పులు తేవాలని ఇంటర్ విద్యామండలి కసరత్తు మొదలు పెట్టింది.
సెలవుల విధానంలో మార్పు
ప్రస్తుతం ఇంటర్ విద్యార్ధులకు జూన్ 1 నుంచి మార్చితో విద్యా సంవత్సరం ముగుస్తోంది. ఏప్రిల్, మే నెలలు కాలేజీలకు సెలవులు ఇస్తున్నారు. ఇకపై వేసవి సెలవులను విద్యా సంవత్సరం మధ్యలోకి తేవాలని బోర్డు భావిస్తోంది. మార్చితో విద్యా సంవత్సరం ముగిస్తే, ఆ వెంటనే ఏప్రిల్ 1 నుంచి తర్వాత విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలా ప్రతిపాదనల పైన కసరత్తు జరుగుతోంది. ఏప్రిల్లో 1 నుంచి 24 వరకు తరగతులు నిర్వహిస్తారు. ఆ తర్వాత వేసవి సెలవులు ఇచ్చి, తిరిగి జూన్ 1న కాలేజీలు తెరిచేలా క్యాలెండర్ సిద్దం చేస్తున్నారు. దీంతో, వేసవి సెలవులకు ముందు పూర్తిచేసిన సిలబస్ నుంచి బోధన కొనసాగించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. వీటి పైన ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications