అమరావతి క్యాపిటల్ రీజియన్: వారంలో అయిదు రోజుల పని: వారికి మాత్రమే: ఏడాదికి..!
అమరావతి: కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోని ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ సర్కార్.. కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సచివాలయం సహా వివిధ విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల కోసం అమలు చేస్తోన్న వారంలో అయిదు రోజుల పని సౌకర్యాన్ని మరో ఏడాదికి పొడిగించింది. ఇది రాజధాని అమరావతి ప్రాంత పరిధిలో నివసించే వారికి మాత్రమే వర్తిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సౌకర్యం ఈ నెల 27వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు ఆదిత్యనాథ్ దాస్ ఈ జీవోలో పేర్కొన్నారు.
దీనితో పాటు పని వేళలను కూడా ప్రభుత్వం నిర్ధారించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుందని తెలిపింది. దీని ప్రకారం చూస్తే అమరావతి రాజధాని ప్రాంత పరిధిలోని సచివాలయం, వివిధ విభాగాధిపతుల కార్యాలయాలు సాయంత్రం 5:30 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ఏపీ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ (అప్సా) ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు జగన్ సర్కార్- వారంలో అయిదు రోజుల పని సౌకర్యాన్ని ఏడాది పాటు పొడిగించింది. 2022 జూన్ 27వ తేదీ వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి.
విభజన అనంతరం చాలామంది సచివాలయం, వివిధ విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల కుటుంబాలు అమరావతి రాజధాని ప్రాంతానికి తరలి రాలేదు. తమ పిల్లల చదువులు, ఇతర అవసరాల ఇంకా హైదరాబాద్లోనే నివసిస్తోన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని వారంలో రెండు రోజుల పని సౌకర్యాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. శని, ఆదివారాలను సెలవుదినాలుగా ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ సౌకర్యాన్ని జగన్ సర్కార్ దీన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ జీవోను జారీ చేసింది.