మూడు జీవోల్లో అన్నేసి ఎకరాలు : అంతా సక్రమమేనా..!
విజయవాడ : నేతల ఒత్తిడో.. మరేమో తెలియదు గానీ, లోపాలున్నాయంటూ నెలల తరబడి పక్కనబెట్టిన ఫైల్స్ చక-చకా కదిలిపోవడం, ఆయా ప్రాజెక్టులకు పూర్తి అనుమతులు ఇచ్చేయడం, అవసరమైతే అమ్ముకునే హక్కులు కూడా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం జీవోలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
తాజాగా విడుదల చేసిన మూడు జీవోలు కూడా రాత్రి వేళల్లోనే విడుదల చేయడం పట్ల కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. ప్రభుత్వం విడుదల చేసిన తాజా జీవోలు కర్నూలు, గుంటూరు జిల్లాలో భూములకు సంబంధించినవి కావడం గమనార్హం. ఈ భూములను ఇప్పుడు చౌక ధరలకే ఆయా కంపెనీలకు ప్రభుత్వం కట్టబెట్టిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ లిమిటెడ్ అనే కంపెనీ కర్నూలు జిల్లా తంగెదంచెలో ఉద్యావన పార్కు ఏర్పాటు చేస్తామనే ప్రతిపాదనతో 2014 లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అయితే ప్రాజెక్టుకు సంబంధించిన డాక్యుమెంట్లలో లోపాలను గుర్తించిన అధికారులు సదరు కంపెనీ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టేశారు.
అయితే.. ఏమైందో ఏమో తెలియదు గానీ సదరు కంపెనీ కోరిన భూమిని మంజూరు చేస్తూ ఇప్పుడు జీవో జారీ చేసింది ప్రభుత్వం. జీవో ద్వారా మొత్తం 632.40 ఎకరాలను కంపెనీకి ప్రభుత్వం కట్టబెట్టింది. అంతేకాదు, ప్రభుత్వం ఇచ్చిన భూమిని కంపెనీ తమకు అవసరమైనప్పుడు అమ్ముకోవచ్చని కూడా జీవోలో పేర్కొన్నట్టు సమాచారం.
అలాగే, అదే తంగెదంచెలో అంబుజా ఎక్స్ పోర్ట్స్ కంపెనీకి 200 ఎకరాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం రెండో జీవో జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన భూమిలో సదరు కంపెనీ మొక్క జొన్న శుద్ది కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు వల్ల 500 ఉద్యోగాలు కూడా కల్పించనున్నట్టు సమాచారం.
ఇక మరో జీవో ద్వారా ప్రిజ సాఫ్ట్ వేర్ సొల్యూషన్ అనే కంపెనీకి గుంటూరు జిల్లా పొత్తూరు ఇండస్ట్రియల్ పార్కులో 15 ఎకరాలను మంజూరు చేస్తూ జీవో జారీ అయింది. అయితే భూములకు సంబంధించిన ఈ జీవోలపై నామ మాత్రపు ధరలకే విక్రయం జరిగిందని, దీని వెనుక బడా బాబుల హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నట్టుగా సమాచారం.