ఏపీలో ఆ ఉద్యోగుల జీతాలు 20 శాతం పెంపు..! గ్రాట్యుటీ డబుల్..!
ఏపీలో కూటమి ప్రభుత్వం (ap govt) అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది. ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు (employees) డీఏ, పీఆర్సీ బకాయిల చెల్లింపు, కొత్త పీఆర్సీ నియామకం, ఐఆర్ ప్రకటన సహా పలు హామీల్ని ఇచ్చాయి. అయితే వీటిలో ఏ ఒక్కటీ ఇప్పటివరకూ నెరవేరలేదని వారంతా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఓ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఏకంగా 20 శాతం జీతాల పెంపుతో పాటు గ్రాట్యుటీని కూడా డబుల్ చేసింది.
రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో (పీఏసీఎస్) పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాల్ని 20 శాతం పెంచుతూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తాజాగా ఆయా ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన చర్చల్లో హామీ ఇచ్చారు. అలాగే వారికి ప్రస్తుతం ఇస్తున్న 2 లక్షల రూపాయాల గ్రాట్యుటీని సైతం రెట్టింపు చేస్తూ అంటూ 4 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

వీటితో పాటు పీఏసీఎస్ ఉద్యోగులకు కల్పిస్తున్న ఆరోగ్య బీమాలోనూ మార్పు చేసారు. ప్రతీ ఉద్యోగికీ 5 లక్షల కవరేజీతో కూడిన సమగ్ర గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ వర్తింపచేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. దీంతో సమ్మెకు సిద్దమైన పీఏసీఎస్ ఉద్యోగులు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయాల అమలు కోసం ఉన్నతస్థాయి కమిటీని కూడా నియమిస్తామని మంత్రి వారికి తెలిపారు. అలాగే పీఏసీఎస్ ఉద్యోగుల ఇతర డిమాండ్లను కూడా పరిశీలించి ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు.












Click it and Unblock the Notifications