అమిత్ షా ముందు ఏపీ చిట్టా- మూడు రాజధానులకు నిధులివ్వండి : కేంద్రం తేల్చేసింది..!!
ఏపీ ప్రభుత్వం కేంద్రానికి అధికారికంగా మూడు రాజధానుల వ్యవహరం పైన సహకారం కోరుతోంది. ఈ నెల 14న తిరుపతి కేంద్రంగా దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం జరగనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో తొలుత 23 అంశాలతో సమావేశం ఎజెండాకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన మూడు అంశాల్ని స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ అనుమతితో ఎజెండాలో చేర్చారు. 24 అంశాల్ని ఇప్పుడు కొత్తగా చర్చకు చేపట్టనున్నారు. వాటిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలే ఏడున్నాయి.
మూడు రాజధానులకు నిధులివ్వండి
రాష్ట్రంలో మూడు రాజధానుల సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఉదారంగా నిధులివ్వాలని దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. ఏపీకి కొత్త రాజధాని అభివృద్ధి కోసం రూ.2,500 కోట్ల సాయాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం 2014-17 మధ్య రూ.1,500 కోట్లు విడుదల చేసిందని, మిగతా రూ.వెయ్యి కోట్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేయనుంది. వీటితో పాటుగా పలు ఇతర అంశాలను ఏపీ ప్రభుత్వం సమావేశంలో ప్రస్తావించేందుకు సిద్దమైంది. అందులో ప్రధానంగా..ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ విద్యుత్ సంస్థలు చెల్లించాల్సిన రూ.6015 కోట్ల బకాయిలపైనా ప్రస్తావించనుంది.
తెలంగాణ..తమిళనాడు అంశాల పైనా
తెలుగుగంగ ప్రాజెక్టు నుంచి చెన్నైకి తాగునీటి సరఫరా చేసినందుకు తమిళనాడు ఇంకా రూ.338 కోట్ల చెల్లించాల్సిన అంశాన్ని అందులో చేర్చింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు. రామాయపట్నం ఓడరేవు, కడపలో ఉక్కు కర్మాగారం, కాకినాడలో గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు, విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవాకి ఏడీపీ ఇచ్చే రుణాన్ని గ్రాంట్గా మార్చడం వంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించనుంది. ఏపీ ప్రాదేశిక జలాల్లోకి తమిళనాడుకు చెందిన ఫిషింగ్బోట్లు అక్రమంగా ప్రవేశించడం వల్ల స్థానిక మత్స్యకారులతో ఘర్షణలు జరుగుతున్నాయనే అంశాన్ని అందులో చేర్చింది.
కేంద్రం ముందు కీలక అంశాల ప్రస్తావన
జాతీయ ఆహార భద్రత చట్టం కింద రాష్ట్రానికి కేంద్రం కేటాయింపుల గురించి వివరించింది. ఏపీలో దారిద్య్రరేఖకు దిగువన గ్రామాల్లో 10.96%, పట్టణాల్లో 5.81% ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. చిత్తూరు జిల్లాలోని కుప్పంలో పాలార్ నదిపై చిన్ననీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణంపై తమిళనాడు అభ్యంతరం చెప్పడంపై చర్చకు అభ్యర్ధించింది. జాతీయ పోలీస్ అకాడమీ తరహాలో ఆంధ్రప్రదేశ్లో మధ్య, ఉన్నతస్థాయి జైలు సిబ్బందికి శిక్షణ కోసం జాతీయ ప్రిజన్ అకాడమీ ఏర్పాటు అంశాన్ని ఏపీ ప్రతిపాదించింది.
పొరుగు రాష్ట్రాలు సైతం తమ అజెండాతో
ఇక, ఇదే సమయంలో కర్ణాటక ప్రభుత్వం ఏపీ-తెలంగాణతో సంబంధిత అంశాలను జాబితాలో చేర్చింది. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ నుంచి పాలమూరు-రంగారెడ్డి, నక్కలగండి ఎత్తిపోతల పథకాలను తెలంగాణ చేపట్టడాన్ని కర్ణాటక ప్రభుత్వం ఎజెండాలో పెట్టింది. తుంగభద్ర నదిపై ఏపీ ప్రతిపాదిత గుండ్రేవుల ప్రాజెక్టు అంశాన్ని, తెలంగాణ చేపట్టనున్న రాజీవ్గాంధీ సంగంబండ బ్యారేజీ అంశాన్ని సైతం కర్ణాటక ఎజెండాలో చేర్చింది. ఇదే సమయంలో కేంద్రం నుంచి మూడు రాజధానుల అంశం పైన స్పందించింది.
Recommended Video
కేంద్రం వైఖరి ఏంటో అమిత్ షా క్లారిటీ ఇస్తారా
స్టాండింగ్ కమిటీ రూపొందించిన సమావేశంలో ఎజెండాలో మాత్రం.. మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉందని కేంద్ర హోం శాఖ చెప్పినట్టుగా పేర్కొన్నారు. కొత్త రాజధాని నిర్మాణానికయ్యే మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరించేలా చట్టాన్ని సవరించాలని అక్టోబరు 20న రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టుగా స్పష్టం చేసారు. కేంద్ర హోం మంత్రి సమక్షంలో ముఖ్యమంత్రులతో జరిగే ఈ సమావేశంలో గతం కంటే భిన్నంగా స్పష్టమైన వైఖరితో తమ సమస్యలను ప్రస్తావించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో...వీటన్నింటి పైనా కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత వస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.