ఎమ్మెల్యేలకు నిధులు - అమరావతికి ఏం చేస్తారు : 2.50 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్..!!
ఏపీ ప్రభుత్వం ఈ రోజు 2022-23 వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టనుంది. 10.15 గంటలకు ఆర్దిక మంత్రి బుగ్గన శాసనసభలో..అదే సమయంలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి శాసన మండలిలో బడ్జెట్ ను ప్రవేశ పెడతారు. 2021-22 వార్షిక సంవత్సరానికి 2.29 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించిన ఏపీ ప్రభుత్వం..ఈ ఏడాది 2.52 లక్షల కోట్ల వరకు ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయి. రెవెన్యూ వ్యయమే భారీగా 80 శాతం వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఉదయం 9 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశమై బడ్జెట్ ను ఆమోదిస్తోంది. వ్యవసాయ రంగంతో పాటు విద్య, వైద్యం, సంక్షేమ రంగాలకు పెద్ద పీట వేయనున్నారు.

ఒక్కో ఎమ్మెల్యేలకు రెండో కోట్ల నిధులు
విద్య, వైద్య రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అభివృద్ధి నిధి కింద ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.రెండు కోట్ల చొప్పున మొత్తం రూ.350 కోట్లను బడ్జెట్లో కేటాయించనున్నట్లు సమాచారం. వైఎస్సార్ పెన్షన్ కానుక కోసం బడ్జెట్లో ఏకంగా రూ.18 వేల కోట్లకుపైగా కేటాయించే వీలుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉప ప్రణాళికలకు భారీ కేటాయింపులు చేయనున్నారు. వరుసగా రెండో ఏడాది ఆర్థికంగా వెనుకబడిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు అగ్రవర్ణ పేద మహిళలకు ఈబీసీ నేస్తం కోసం బడ్జెట్లో రూ.600 కోట్లు కేటాయింపులు చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నాడు - నేడు కు ఈ బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలెస్తోంది.

నాడు - నేడుకు ప్రాధాన్యత
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశ పెడుతున్న ఈ నాలుగో బడ్జెట్ సైతం నవరత్నాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పొదుపు సంఘాలకు వైఎస్సార్ ఆసరా కోసం బడ్జెట్లో రూ.6,400 కోట్లు కేటాయించనున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో నాడు-నేడు కింద మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.3,500 కోట్లు, ఆస్పత్రుల్లో నాడు-నేడు కోసం రూ.3,000 కోట్లు కేటాయించనున్నారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకానికి రూ.2,000 కోట్లు, బియ్యం సబ్సిడీకి రూ.3,500 కోట్లు కేటాయింపులు చేయనున్నారు. పారిశ్రామిక రాయితీల కోసం రూ.1,200 కోట్లు కేటాయించే అవకాశం ఉంది. అమ్మ ఒడి పథకానికి రూ.6,500 కోట్లు కేటాయింపులు చేయనున్నారు.

రాజధానికి నిధులు కేటాయింపుపై ఆసక్తి
పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల కోసం రూ.500 కోట్లు కేటాయింపులు చేయనున్నారు. వ్యవసాయ రంగానికి ప్రత్యేకంగా బడ్జెట్ ప్రతిపాదించనున్నారు. వ్యవసాయం అనుబంధ రంగాల కోసం మొత్తంగా రూ 30 వేల కోట్లకు పైగా కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. సాధారణ బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తరువాత శాసనసభలో మంత్రి కన్నబాబు ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. మండలిలో వ్యవసాయ బడ్జెట్ను పశుసంవర్థక శాఖ మంత్రి అప్పలరాజు ప్రవేశపెట్టనున్నారు. హైకోర్టు అమరావతిలో ఒప్పందం మేరకు నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించిన నేపథ్యంలో..ప్రభుత్వం అమరావతి కోసం బడ్జెట్ లో ఎటువంటి ప్రస్తావన.. నిధుల ప్రతిపాదనలు చేస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications