ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - మద్యంపై పన్ను రేట్లు సవరణ : వ్యాట్ లో మార్పు ఇలా...!!
ఏపీలో మద్యం విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మద్యంపై పన్ను రేట్లు సవరిస్తూ ప్రభుత్వం గెజట్ జారీ చేసింది. మద్యం మూల ధరపై తొలి విక్రయం జరిగేచోట పన్ను సవరణతో పాటు దేశంలో తయారైన విదేశీ బ్రాండ్లపై ధర ఆధారంగా పన్నుల్లో మార్పులు చేసింది. విలువ ఆధారిత పన్నులో మార్పులు చేస్తూ అబ్కారీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు ఇచ్చారు. మద్యం మూల ధరపై మొదటి విక్రయం జరిగే చోట పన్ను ధరల్ని సవరిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
విదేశీ మద్యం బ్రాండ్లపై ధర ఆధారంగా
దేశంలో తయారైన విదేశీ మద్యం బ్రాండ్లపై ధర ఆధారంగా పన్నుల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ .400 ధర లోపు ఉన్న బ్రాండ్లకు 50 శాతం మేర వ్యాట్ ఖరారు చేసింది. రూ.400 నుంచి 2500 వరకూ ఉన్న మద్యం కేసుకు సంబంధించి 60 శాతం వ్యాట్ వసూలుకు నిర్ణయం తీసుకుంది. అదే విధంగా.. రూ.2500 నుంచి 3500 వరకూ ఉన్న మద్యం కేసుకు 55 శాతం మేర వ్యాట్ చెల్లించాల్సి ఉంటుంది. రూ.3500 నుంచి 5000 వరకూ ధర ఉన్న మద్యం కేసుపై 50 శాతం విధించింది.
వైన్ మద్యంపై 35 శాతం వ్యాట్
రూ.5000 ఆ పై ధర పలికే మద్యం కేసుపై 45 శాతం వ్యాట్ వసూలుకు నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అదే సమయంలో..దేశీయంగా తయారై ప్యాకింగ్ చేసిన బీర్ల కేసుపై 200 కంటే ధర తక్కువ ఉన్న వాటిపై 50 శాతం వసూలు చేయనున్నారు. 200 రూపాయల కంటే ఎక్కువ ధర ఉన్న బీర్ కేస్ పై 60 శాతం వ్యాట్ వసూలుకు నిర్ణయించారు. ఇక అన్ని రకాల వైన్ మద్యంపై 35 శాతం వ్యాట్ వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రెడీ టు డ్రింక్ వెరైటీలన్నిటిపైనా 50 శాతం
రెడీ టు డ్రింక్ వెరైటీలన్నిటిపైనా 50 శాతం మేర వ్యాట్ పన్ను విధించాలని నిర్ణయించిన అబ్కారీ శాఖ ఈ మేరకు స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ప్రభుత్వం కొత్తగా ఫిక్స్ చేసిన వ్యాట్ ద్వారా మద్యం ధరలు తొలి విక్రయం జరిగేచోట సవరణ ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే ఏపీలో నాసిరకంగా మద్యం బ్రాండ్లను విక్రయిస్తున్నారని... ఆరోగ్యంతో చెలాగాటంతో పాటుగా సొమ్ము చేసుకుంటున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వెనుక అసలు ఉద్దేశం ఏంటనేది క్లారిటీ రావాల్సి ఉంది.