ఆర్టీసీ సిబ్బంది కాదు..వారంతా ఇక..: 51 వేల మందికి లబ్ది: కొత్తగా ఇవే ప్రయోజనాలు..!
ఏపీయస్ఆర్టీసీ ఉద్యోగులుగా వారికి ఇదే చివరి రోజు. జనవరి 1 నుండి వారంతా ఇక ప్రభుత్వ ఉద్యోగులే. ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం..అసెంబ్లీ చట్టం..గవర్నర ఆమోదంతో ఇక ఈ నిర్ణయం అధికారి కంగా అమల్లోకి రానుండి. ఈ మేరకు ఇప్పటికే రవాణా శాఖ మంత్రి సైతం స్పష్టమైన ప్రకటన చేసారు. ప్రభుత్వంలో ఆర్టీసి విలీనం ప్రక్రియ పైన ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కసరత్తు చేసారు.
ఇప్పుడు..అధికారికంగా ఆర్టీసీ సిబ్బంది అంతా ప్రభుత్వ ఉద్యోగులవున్నారు. దీని ద్వారా మొత్తంగా 51,488 మంది సిబ్బందికి ప్రయోజనం కలుగుతుండగా..ప్రభుత్వం పైన ఏటా రూ 3600 కోట్ల అదను భారం పడనుంది. దీనిని చిరునవ్వుతో స్వీకరిస్తామని శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటించారు.
ఆర్టీసీ ఉద్యోగులుగా నేటితో...
జనవరి 1 నుంచి ఆర్టీసీ సిబ్బంది ప్రజా రవాణా ఉద్యోగులుగా మారనున్నారు. దేశంలో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ మినహాయించి ఏ రాష్ట్రంలోనూ ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల ఆ సంస్థలో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న అన్ని కేటగిరీల్లోని సిబ్బందికి లబ్ధి చేకూరనుంది. ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ప్రజా రవాణా శాఖలో విలీనమైన వెంటనే చెల్లించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రేపటి నుండి వారంతా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని రవాణా శాఖ మంత్రి ప్రకటించారు.
51 వేల మంది కార్మికులకు ప్రయోజనం..
ప్రభుత్వ నిర్ణయం తో ఇప్పటి వరకు ఆర్టీసీలో పని చేస్తున్న 51,488 మంది సిబ్బందికి లబ్ది కలగనుంది. వారికి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు లభిస్తుంది. ఏపీఎస్ఆర్టీసీ ఇప్పటికే రూ.6,400 కోట్ల మేరకు నష్టాల్లో ఉండగా..ప్రభుత్వ తాజా నిర్ణయం కారణంగా ఏటా రూ.3,600 కోట్ల భారాన్ని ప్రభుత్వం తన భుజాన వేసుకుందని మంత్రి పేర్ని నాని చెప్పారు. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కొత్తగా ప్రజా రవాణా శాఖను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా, ఆర్ అండ్ బీ పరిపాలన నియంత్రణలోనే పీటీడీ శాఖ రవాణా, ఆర్ అండ్ బీ పరిపాలన నియంత్రణలో ప్రజా రవాణా శాఖ (పీటీడీ)ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వుల్లో స్పష్టం చేసారు.
విలీనంతో ఉద్యోగులకుప్రయోజనాలు..
ఈ నిర్ణయం ద్వారా సంస్థకు ఆర్థిక భద్రత చేకూరడం వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఉద్యోగ భద్రత ఉంటుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందుతాయి. అదే విధంగా.. ఆర్టీసీ లాభనష్టాలతో సిబ్బందికి సంబంధం ఉండదు. పదవీ విరమణ వయసు 60 ఏళ్లుగా ఉంటుంది. కార్మికులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను రెండేళ్లలో చెల్లిస్తారు.
చంద్రబాబు హయాంలో ఆర్టీసీ ఉద్యోగులకు లీవ్ ఎన్క్యాష్మెంట్ కింద రూ.47 కోట్ల మేర బాండ్లు ఇచ్చారు. ఆ బాండ్లకు నగదు చెల్లిస్తారు. ఆర్టీసీ సిబ్బందిపై అనవసర ఒత్తిళ్లు ఉండవు.. అధికారుల పెత్తనం తగ్గుతుంది. పనిష్మెంట్లు ఇష్టారీతిన ఇచ్చేందుకు కుదరదు. వీటి ద్వారా సిబ్బంది పని ఒత్తిడి..మానసిక ఆందోళన ఉండదని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.