జగన్ సర్కార్ కు తప్పలేదు - ఏబీపై సస్పెన్షన్ ఎత్తివేత : పోరాడి సాధించిన సీనియర్ ఐపీఎస్..!!
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వేంకటేశ్వర రావు విషయంలో ఏపీ ప్రభుత్వం సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు ఏబీ వేంకటేశ్వర రావుపైన సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏబీ వేంకటేశ్వర రావు ఇంటలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో ఆయన పైన వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. దీంతో..ఆయన్ను 2019 ఎన్నికల సమయంలో నాడు ఎన్నికల సంఘం ఎన్నికల విధులకు దూరంగా ఉంచుతూ ఆదేశించింది.

ఎట్టకేలకు సస్పెన్షన్ ఎత్తివేత
ఇక, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏబీవీ పైన ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన పైన అనేక ఆరోపణలు చేసారు. కేంద్ర హోం శాఖకు లేఖలు రాసారు. నాటి సస్పన్షన్ ను కేంద్రం సైతం ఆమోదించింది. ఆయన నిఘా చీఫ్ గా వ్యవహరించిన సమయంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారంటూ అప్పట్లోనే టీడీపీ నేతలు ఆరోపించారు. నంద్యాల బై పోల్ సమయంలోనే ఆయన అక్కడే మకాం వేసి టీడీపీ గెలుపు కోసం పని చేసారంటూ విమర్శలు గుప్పించారు. ఇక, పెగాసస్ విషయంలోనూ వైసీపీ నుంచి ఏబీవీ పైన ఆరోపణలు వినిపించాయి. వీటన్నింటికి ఏబీ వివరణ ఇచ్చారు. అసలు రాష్ట్రంలో అటు స్పై వేర్ లేదని తేల్చి చెప్పారు. ఇదే అంశం పైన ఏపీ అసెంబ్లీలోనూ చర్చ సాగింది.

సుప్రీం ఆదేశాలతో తాజా ఉత్తర్వులు
ఇక, ఏబీ వేంకటేశ్వర రావు పైన ఎంక్వయిరీస్ ఆఫ్ కమీషనర్ విచారణ సైతం పూర్తి చేసి నివేదిక ఇచ్చారు. అయితే, తన పైన విధించిన సస్పెన్షన్ ను మరోసారి పొడిగింపుకు అవకాశం లేదని..తనను తిరిగి సర్వీసులో చేర్చుకోవాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో..ఆయనకు అనుకూలంగా సుప్రీంలో తీర్పు వచ్చింది. ఏబీ పైన సుప్రీం సస్పెన్షన్ ఎత్తివేసి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. అయితే, తనను సస్పెన్షన్ చేసిన రోజు నుంచి తిరిగి సర్వీసులోకి తీసుకోవాలంటూ ఏబీ కోరుతూ వచ్చారు. సుప్రీం తీర్పుతో ఆయన పలు మార్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసేందుకు సచివాలయానికి వచ్చారు. అయితే, సీఎస్ అందుబాటులో లేకపోవటంతో ఆయన కలిసే అవకాశం రాలేదు.

ఏ పోస్టింగ్ దక్కనుంది..
ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏబీ పైన సస్పెన్షన్ ఎత్తివేస్తూ.. ఆయను జీఏడిలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఆయన సర్వీసును మాత్రం ఫిబ్రవరి 22వ తేదీ నుంచి జీఏడీలో రిపోర్టు చేసే వరకు తప్పనిసరి వెయిటింగ్ లో ఉంచాలని సూచించింది. ఆయన జీఏడీకి రిపోర్టు చేసిన తరువాత ఆయనకు సంబంధించి పోస్టింగ్ పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. దీంతో.. 1989 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఇప్పుడు పోరాటం చేసి..తిరిగి సర్వీసులో చేరబోతున్నారు. తాజాగా.. పెద్ద ఎత్తున ఐపీఎస్ లను బదిలీ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఏబీ వేంకటేశ్వర రావుకు ఏ పోస్టింగ్ ఇస్తారనేది ఇంట్రస్టింగ్ గా మారుతోంది.












Click it and Unblock the Notifications