జగన్ సర్కార్కు మరో షాక్: అలా జీవో విడుదల.. ఇలా ఏపీ హైకోర్టులో పిటీషన్
అమరావతి: రాజధాని అమరావతి వ్యవహారంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఉదయం జారీ చేసిన జీవో నంబర్ 45పై అమరావతి ప్రాంత రైతులు హైకోర్టులో సవాల్ చేశారు. లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. హైకోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది. ఈ మధ్యాహ్న భోజన విరామం అనంతరం ఈ పిటీషన్ విచారణకు రానుంది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, విడుదల చేసిన జీవోలు, గెజిట్ నోటిఫికేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటీషన్ దాఖలు కావడం ఈ మధ్యకాలంలో ఇది రెండోసారి. ఇదివరకు అమరావతి రీజియన్లో ఆర్-5 జోన్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన గెజిట్ నోటిఫికేషన్ను వ్యతిరేకిస్తూ పిటీషన్లు దాఖలైన విషయం తెలిసిందే.
దీనిపై విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అమరావతి రీజియన్ పరిధిలో పేదల ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలనే ఉద్దేశంతోనే ఏపీ ప్రభుత్వం ఈ గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేయగా.. దీన్ని వ్యతిరేకిస్తూ రెండు రోజుల కిందట హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. తెలుగుదేశం పార్టీ తరఫున ఈ పిటీషన్లు దాఖలయ్యాయి.

ఇప్పుడు తాజాగా ప్రభుత్వం జీఓ నంబర్ 45ను జారీ చేయగా దానిపై కూడా అమరావతి ప్రాంత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అమరావతిలో 1134.58 ఎకరాల భూమిని పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించింది ప్రభుత్వం. ఇందులో మొత్తం 20 లే-అవుట్లలో స్థలాలను మంజూరు చేసింది. దీనివల్ల గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 48, 218 మంది నిరు పేదలకు ఇళ్ల పట్టాలను అందించాల్సి ఉంది. ఈ మేరకు రెవెన్యూ మంత్రిత్వ శాఖ జీఓను జారీ చేసింది.
ఈ జీఓ అమలుపై స్టే ఇవ్వాలంటూ అమరావతి ప్రాంత రైతులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ మధ్యాహ్నం భోజన విరామం అనంతరం దీనిపై హైకోర్టు విచారణ చేపట్టనుంది. రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఇది. ఇది విడుదలైన కొద్దిసేపటికే రైతులు హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశమైంది.
రాష్ట్రంలో అందరికీ ఇళ్లు పథకం కింద పేదలకు ఇళ్ల పట్టాలను మంజూరు చేస్తోన్న విషయం తెలిసిందే. జగనన్న కాలనీల పేరుతో వాటి నిర్మాణం చేపట్టింది. అమరావతి రీజియన్ పరిధిలోని గ్రామాల్లో కూడా జగనన్న కాలనీలను నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా జీఓ నంబర్ 45ను జారీ చేసింది. ఈ జీఓను అమరావతి ప్రాంత రైతులు వ్యతిరేకిస్తోన్నారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో నివసించే పేదలకు ఏపీ ప్రభుత్వం- అమరావతి రీజియన్ పరిధిలో ఇళ్ల స్థలాలను మంజూరు చేయడాన్ని తప్పు పడుతున్నారు.












Click it and Unblock the Notifications