జగన్ సర్కార్ అనూహ్యం: మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఆవిర్భావం: శ్రీలక్ష్మి
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కీలక జీవోను జారీ చేసింది. రాజకీయంగా ప్రాధాన్యతతో కూడిన జీవో ఇది. ఇటీవలే ముగిసిన గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఇది విడుదల కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమరావతి ప్రాంతానికి గుండెకాయగా చెప్పుకొనే మంగళగిరి-తాడేపల్లి మున్సిపాలిటీల పరిధిని అతిపెద్ద పట్టణ ప్రాంతంగా గుర్తించింది జగన్ సర్కార్.
నో ఫ్యాన్..ఓన్లీ విసనకర్ర: కేశినేని శ్వేత: బ్లేజ్వాడలో ఎలా: ఎంత వినాశనం: ర్యాగింగ్ నెక్స్ట్ లెవెల్
మున్సిపల్ కార్పొరేషన్గా..
ఈ రెండు మున్సిపాలిటీల పరిధిని మున్సిపల్ కార్పొరేషన్గా ప్రకటించింది. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీకి ఆయువు పట్టుగా ఉందంటూ భావిస్తోన్న రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన నేపథ్యంలో జగన్ సర్కార్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం ఆసక్తి రేపుతోంది.
13కు చేరిన కార్పొరేషన్ల సంఖ్య..
మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీల పరిధిని కార్పొరేషన్గా గుర్తించడంతో వాటి సంఖ్య పెరిగినట్టయింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 12 మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా.. ఇక ఆ సంఖ్య 13కు చేరింది. విజయనగరం, విశాఖపట్నం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప మున్సిపాలిటీలుగా కొనసాగుతున్నాయి. తాజాగా ఇదే జాబితాలోకి మంగళగిరి, తాడేపల్లి చేరింది.
వీఎంఆర్డీఏ పరిధి కూడా పెంపు..
మంగళగిరి మున్సిపాలిటీతో పాటు దాని పరిధిలో ఉన్న 11 పంచాయతీలు, తాడేపల్లి మున్సిపాలిటీతో పాటు దాని పరిధిలో ఉన్న 10 పంచాయతీలను కొత్త మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఏపీ మున్సిపల్ యాక్ట్ 1994 ప్రకారం మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. దీనితో పాటు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని కూడా పెంచుతూ శ్రీలక్ష్మీ ఉత్తర్వులు జారీ చేశారు.
13 మండలాలు వీఎంఆర్డీఏలో విలీనం..
13 మండలాలను వీఎంఆర్డీఏలో విలీనం చేశారు. నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, రావికమతం, బుచ్చయ్యపేట, నాతవరం, కే కోటపాడు, దేవరాపల్లి, మాకవరపాలెం, కోటఊరట్ల, గొలుగొండ, రోలుగుంట, చీడికాడ మండలాల పరిధిలోని కొన్ని గ్రామాలు వీఎంఆర్డీఏలో విలీనం అయ్యాయి. ఫలితంగా- వీఎంఆర్డీఏ పరిధిలో ఉన్న గ్రామాల సంఖ్య 431కి పెరిగింది. అలాగే-దీని విస్తీర్ణం 2,280.19 చదరపు కిలోమీటర్లకు చేరింది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడటం, ప్రజా ప్రతినిధుల పాలన ఏర్పడిన అతి కొద్దిరోజుల్లోనే మున్సిపల్ పరిపాలనలో విప్లవాత్మక మార్పునకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టినట్టయింది.