ఇక ఆ స్థలమూ, ఇల్లు మీదే - వారికే యాజమాన్య హక్కులు, తాజా ఉత్తర్వులు..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న భూముల వ్యవహారం పై స్పష్టత ఇచ్చింది. అసైన్డ్ ఇంటి స్థలాలు కలిగిన పేదలకు ఆ స్థలాల పైన పూర్తి హక్కు కల్పించటంతో పాటుగా రిజిస్ట్రేషన్ కు వీలుగా అవకాశం కల్పించింది. ఈ మేరకు మార్గ దర్శకాలను ఖరారు చేస్తూ రెవిన్యూ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దీని ద్వారా దశాబ్దాలుగా ఈ భూముల విషయంలో కొనసాగుతున్న సందిగ్ధత కు తెర పడింది
ఏపీ ప్రభుత్వం పదేళ్లు గడువు తీరిన ప్రతి అసైన్డ్ ఇంటి స్థలాన్నీ పట్టాదారుల పేరిటే రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించింది. లబ్ధిదారుకు ఇంటి స్థలం అసైన్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వు, ఇంటి పట్టాతోపాటు, ఇంటి పన్ను చెల్లించిన రశీదు ఉంటే చాలు రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించారు. అయితే, ఆ ఇంటిపట్టా లబ్ధిదారు పేరిట ఉండాలి. అందులో లబ్ధిదారుడే పొజిషన్లో ఉండాలి. ఇంటిస్థలం రిజిస్ట్రేషన్ అయిన 90 రోజుల తర్వాత దా నిపై క్రయ, విక్రయాలకు అవకాశం ఉంటుంది. అంటే, లబ్ధిదారు పూర్తి హక్కులతో కూడిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పొందిన 90 రోజుల తర్వాత, తిరిగి ఆ ఇంటిని అమ్ముకోవచ్చు. ఇతరులు కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించి తాజా మార్గదర్శకాల్లో స్పష్టత ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల చట్టం- 1977 ప్రకారం, పేదలకు అసైన్డ్ చేసిన ఇంటి స్థలాలు ఇతరులకు బదిలీ చేయకూడదన్న నిబంధన మొదట్లో ఉండేది.

రెవిన్యూ శాఖ మార్గదర్శకాలు
అయితే సవరించిన చట్టంలోని సెక్షన్ 3(2ఏ), సెక్షన్ 3(2బి) ప్రకారం అసైన్చేసిన పదేళ్ల కాలం దాటాక ఆ భూములను అసైనీల పేరిటే రిజిస్ట్రేషన్ చెయ్యాలి. ఆ తర్వాత పేదలకు ఆ భూములపై శాశ్వత హక్కులు వస్తాయి. కాబట్టి, తమ వ్యక్తిగత అవసరాలకు ఆ భూములను తనఖా పెట్టి రుణాలు తీసుకోవచ్చు. ఇంకా అమ్ముకోవచ్చు. ఇతరులు కొనుగోలు చేయవచ్చు. అసైన్డ్ ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ కోసం లబ్ధిదారు తనకు ఇచ్చిన అసైన్మెంట్ పట్టా, ఉత్తర్వును రిజిస్ట్రేషన్ అధికారికి సమర్పించాలి. వీటితోపాటు ఇంటిపన్ను చెల్లింపు రశీదులను సమర్పించాలి. అసైన్డ్ ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ కోసం వచ్చినప్పుడు ఆ భూమి అసైన్మెంట్ చేసిన కాలపరిమితి పదేళ్లు దాటిందా? లేదా అన్నది నిర్ధిష్టంగా నిర్ధారించుకోవాలి. పదేళ్ల కాలపరిమితి దాటిన వాటికే రిజిస్ట్రేషన్ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.













Click it and Unblock the Notifications