ఏపీ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు..! సర్కార్ తాజా ఉత్తర్వులు..!
ఏపీలోని స్థానిక సంస్థలకు సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు కూటమి సర్కార్ (AP Govt) సిద్దమవుతోంది. ఇందులో భాగంగా తాజాగా నిర్ణయించిన ప్రకారం బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ వరుసగా ఉత్తర్వులు జారీ చేస్తోంది. వీటిలో ముందుగా పట్టణ స్దానిక సంస్థలైన నగర పాలక సంస్థలు, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో రిజర్వేషన్లు ఖరారు చేస్తూ నిన్న ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం.. ఇవాళ గ్రామీణ స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్ లో రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
తాజాగా కేబినెట్ నిర్ణయం, అసెంబ్లీలో చేసిన ప్రకటన మేరకు కూటమి ప్రభుత్వం పట్టణ స్దానిక సంస్థలైన కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ గ్రామ స్దానిక సంస్థలైన గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తుల్లో 34 శాతం రిజర్వేషన్లు బీసీలకు వర్తింపజేస్తూ ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో స్థానిక సంస్దల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చినట్లయింది.

రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 3తో మిగిలింది. అలాగే మండల పరిషత్ ల పదవీకాలం సెప్టెంబర్ 23తోనూ, జిల్లా పరిషత్ ల పదవీకాలం సెప్టెంబర్ 24తోనూ ముగియనుంది. దీంతో ఈ మూడు గ్రామ స్థానిక సంస్థల్లోనూ ఎన్నికల నిర్వహణకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఎన్నికలు పూర్తయితేనే 16వ ఆర్ధిక సంఘం నిధులు రాష్ట్రానికి అందుతాయి. ఇందులో ప్రభుత్వం విఫలమైతే మాత్రం ఆ నిధులు మురిగిపోవడం ఖాయం.













Click it and Unblock the Notifications