మరో ఎన్నికల హామీ అమలు - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు దిశగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ ను రూ 4 వేలకు పెంచుతూ ప్రభుత్వం అమలు చేస్తోంది. దీపావళి నుంచి మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల అమలుకు నిర్ణయం తీసుకున్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. తాజాగా మరో హామీ అమలుకు వీలుగా ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసింది.
ఆలయాలకు నిధులు
రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం లేని చిన్న ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలు నిర్వహించేందుకు అందించే సాయాన్ని రూ 5 వేల నుంచి రూ 10 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని 5,400 ఆలయాలకు ప్రతీన ెలా రూ 10 వేల చొప్పున అందనుంది. ఆదాయం లేని చిన్న ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు నిత్యం దీపం వెలిగించి, నైవేద్యం పెట్టేందుకు ధూప, దీప, నైవేద్యం పథకం అమలు చేస్తున్నారు.

ఎన్నికల హామీ
గతంలో నెలకు రూ 2500 చొప్పున అందిస్తుండగా..2015లో నాటి ప్రభుత్వం ఈ మొత్తాన్ని రూ 5 వేలకు పెంచింది. కానీ, పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ఈ మొత్తాన్ని రూ 10 వేలకు పెంచుతామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ హామీ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రూ 7 వేలు అర్చకుడికి భృతిగా, రూ 3 వేలు ధూప, దీప, నైవేద్యానికి వినియోగించేలా ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చారు. ఈ మొత్తాన్ని ప్రతీ నెలా అర్చకుడి ఖాతాలో జమ చేస్తారు.
ఉత్తర్వులు జారీ
ప్రభుత్వ తాజా నిర్ణయంతో అదనంగా రూ 32.40 కోట్లు ఏడాదికి భారం పడనుంది. ఈ మొత్తాన్ని దేవాదాయ శాఖకు చెందిన సర్వ శ్రయో నిధి నుంచి వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తో రాష్ట్ర వ్యాప్తంగా ఆదాయం లేని ఆలయాల్లో తిరిగి పూర్తి స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వచ్చే నెల నుంచి ఈ మొత్తం అర్చకుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications