ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పై బంపరాఫర్ - 50 శాతం రాయితీ, డెడ్ లైన్..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ పైన భారీ రాయితీ ఇస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన గడువు ఈ నెల 23వ తేదీతో పూర్తి కానుంది. ఇప్పటికే ఈ పథకం కోసం భారీ స్థాయిలో దరఖాస్తులు వస్తున్నాయి. అయితే, చివరి తేదీ ముగిసిన తరువాత క్రమ బద్దీకరణ రుసుములు భారీగా ఉంటాయని చెబుతున్నారు. దీంతో.. ఈ నెల 23వ తేదీ లోగా ఎల్ఆర్ఎస్ వినియోగించుకునే వారు ముందుకు రావటం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పొందే అవకాశం ఉంటుంది.
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఎల్ఆర్ఎస్ ఈ నెల 23వ తేదీతో ముగియనుంది. ఇప్పటి దాకా రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కీం కింద 52,470 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. మరో 25 వేల వరకు దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువు పెంచాలని ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి అభ్యర్ధనలు వస్తున్నాయి. అయితే.. ప్రభుత్వం మాత్రం గడువు పెంపు పైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2025 జులై 26వ తేదీన ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకం పైన ఉత్తర్వులను జారీ చేసింది. దీని ద్వారా 75 వేల మందికి ప్రయోజనం కలగటంతో పాటుగా ప్రభుత్వానికి దాదాపుగా రూ 600 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేసింది. అయితే, జనవరి 23వ తేదీ లోగా ప్లాట్లను క్రమబ్దదీకరించుకొనే వారికి ఓపెన్ స్పేస్ ఛార్జీల్లో ప్రభుత్వం 50 శాతం మేర రాయితీ ప్రకటించింది.

అందులో భాగంగా ఓపెన్ స్పేస్ ఛార్జీ కింద ప్లాట్ మొత్తం విలువలో 14%కు బదులు 7% చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. అయితే, ప్రభుత్వం నిర్దేశించిన గడువు ముగిసిన తరువాత ప్లాట్లు క్రమబద్ధీకరించుకోవాలంటే ఓపెన్ స్పేస్ ఛార్జీలు 14% కట్టాల్సి ఉంటుంది. అదీ ఆ రోజు సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో విలువల ఆధారంగా చెల్లించాలి. బెటర్మెంట్ ఛార్జీలు, ఇతర రుసుముల మొత్తంపైనా మళ్లీ అపరాధ రుసుములు భరించాల్సి ఉంటుంది. ఇవన్నీ చెల్లించేందుకు ముందుకు వచ్చినా.. ఆ లేఔట్లో అప్పటికే కొన్ని ప్లాట్లయినా ఎల్ఆర్ఎస్లో క్రమబద్ధీకరించుకుని ఉంటుందని చెబుతున్నారు. లేదంటే దాన్ని అనుమతుల్లేని లేఔట్గా భావించి క్రమబద్ధీకరణతో పాటుగా అక్కడ ఎలాంటి నిర్మాణాలకు అనుమతి లభించదని అధికారులు తేల్చి చెబుతున్నారు. కాగా, ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తుల్లోనూ పూర్తి సమాచారం ఇవ్వకపోవటం సమస్యగా మారుతోంది. ఇప్పటి వరకు వాటిల్లో9,245 దరఖాస్తులకు సంబంధించి అవసరమైన దస్త్రాలు, వివరాలు లేని కారణంగా వాటిని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం అధికారులు దరఖాస్తుదారులను సంప్రదిస్తున్నారు.












Click it and Unblock the Notifications