నో కాంప్రమైజ్: అవంతి శ్రీనివాస్ శాఖతోనే మొదలు? నెలాఖరులుగా కీలక విభాగాలు విశాఖకు?
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెనుకంజ వేయడానికి సుముఖంగా లేనట్లు కనిపిస్తోంది. పరిపాలన కార్యాలయాలను తరలించే విషయంలో హైకోర్టు ఆంక్షలు విధించినప్పటికీ.. రాజీ పడకూడదనే పట్టుదల ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమౌతోంది. ఈ నెలాఖరులోగా కొన్ని కీలక శాఖలను విశాఖపట్నానికి తరలించడం ఖాయమంటూ ఒకరిద్దరు మంత్రులు చెబుతున్నారు. ఈలోగా న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోతాయని ఆశిస్తున్నారు.
చిరంజీవితో పీసీసీ మాజీ అధ్యక్షుడి భేటీ: మళ్లీ యాక్టివ్ మోడ్లోకి వస్తారా? ఇద్దరూ రీ ఎంట్రీ ఇస్తారా?
మొత్తంగా కాకపోయినా..
మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ప్రస్తుతం హైకోర్టులో విచారణ దశలో ఉంది. విచారణ పూర్తయ్యేంత వరకూ ఒక్క కార్యాలయాన్ని కూడా విశాఖకు తరలించకూడదంటూ ఆంక్షలను విధించింది. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలను మాత్రం తాము అడ్డుకోలేమంటూ హైకోర్టు స్పష్టం చేసింది. దీన్ని ఆధారంగా చేసుకుని జగన్ సర్కార్ కొన్ని కీలక శాఖలను ఒక్కొక్కటిగా విశాఖకు తరలించడానికి సన్నాహాలు చేపట్టినట్లు తెలుస్తోంది.
తాత్కాలికం పేరుతో..
పరిపాలనను వికేంద్రీకరించడానికి ఏర్పడిన అడ్డంకులన్నీ తొలగిపోయేలోపు తాత్కాలికం, పరిపాలనా సౌలభ్యం పేరుతో కొన్ని శాఖలను విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ నెల 25న ఉగాది. ఉగాది నాటికి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని అక్కడికి తరలించే అవకాశాలు లేకపోలేదు. సందర్శకులకు మరింత సౌకర్యాన్ని కల్పించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం విశాఖలో ఏర్పాటు చేస్తారని అంటున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి అనువైన భవనాన్ని అన్వేషించే పనులను అధికారులు ముమ్మరం చేయడమే దీనికి నిదర్శనం.
పర్యాటకంతో ఆరంభమౌతుందా?
పర్యాటక మంత్రిత్వ శాఖ, పర్యాటక అభివృద్ధి సంస్థ, మత్స్య అభివృద్ధి విభాగం వంటి కొన్ని శాఖలు, వాటి అనుబంధ విభాగాలను తొలిదశలో విశాఖపట్నానికి తరలించ వచ్చని తెలుస్తోంది. భవనాలు అందుబాటులో లేకపోయినప్పటికీ.. ప్రస్తుతం ఆయా శాఖలు కొనసాగుతున్న జిల్లా కార్యాలయాలు లేదా ప్రభుత్వ భవనాల్లోనే తాత్కాలికంగా వాటిని ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ఆయా శాఖలు, విభాగాధిపతులకు ఆదేశాలను జారీ చేసినట్లు సమాచారం.
పర్యాటక శాఖ తరలింపుపై మంత్రి ఆసక్తి..
పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్.. ఈ విషయంలో ముందంజలో ఉన్నారని అంటున్నారు. తన శాఖ, దాని పరిధిలో ఉన్న కార్యాలయాలన్నింటినీ విశాఖకు తరలించడానికి ఆయన అత్యంత ఆసక్తిగా ఉన్నారట. విశాఖపట్నానికి ఆనుకునే ఉన్న భీమిలీ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. సచివాలయం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించిన ప్రదేశం కూడా భీమిలీ చుట్టుపక్కలే కావడం దీనికి కారణం.