మార్చి 17న ఏపీ బడ్జెట్ - విశాఖ పై కీలక ప్రకటన..!?
అసెంబ్లీ సమావేశాల వేదికగా విశాఖపైన కీలక ప్రకటనకు ప్రభుత్వం సిద్దం అవుతోంది.
ఏపీ శాసనసభా బడ్జెట్ సమావేశాలు మార్చి 14 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజున నూతన గవర్నర్ అబ్డుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మార్చి 17న 2023-24 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ముహూర్తంగా నిర్ణయించింది. తొలి రోజున గవర్నర్ ప్రసంగం తరువాత బీఏసీ సమావేశం జరగనుంది. సమావేశ అజెండా..ఎన్ని రోజులు నిర్వహించే అంశం పైన నిర్ణయం తీసుకోనున్నారు.
అదే విధంగా మూడు రాజధానుల వ్యవహారం ప్రస్తుతం సుప్రీం కోర్టు విచారణలో ఉండటంతో..విశాఖ కేంద్రంగా ప్రభుత్వం తమ తదుపరి కార్యాచరణ పైన కీలక ప్రకటన చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ఈ సారి బడ్జెట్ సమావేశాలు కీలకంగా మారనున్నాయి.

గవర్నర్ ప్రసంగంతో ఆరంభం
ఏపీ శాసనసభా సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. మార్చి 14వ తేదీ నుంచి ఏపీ శాసనసభా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏపీ నూతన గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన అబ్డుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి తొలి సారి ప్రసంగం చేయనున్నారు. గవర్నర్ ప్రసంగంతో 14వ తేదీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి.
తొలి రోజున గవర్నర్ ప్రసంగం తరువాత స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. సమావేశాల్లో బడ్జెట్.. డిమాండ్స్.. ప్రభుత్వ బిల్లులతో పాటుగా ప్రతిపక్షాల నుంచి ప్రతిపాదించే అంశాల పైన చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
మార్చి 28, 29 తేదీల్లో విశాఖ కేంద్రం జీ20 సన్నాహక సదస్సు జరగనుంది. ప్రభుత్వం ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటంతో ముందుగానే మార్చి 25 లేదా 27వ తేదీతో సమావేశాలు ముగిసే అవకాశం కనిపిస్తోంది.

బడ్జెట్ వేళ కీలక నిర్ణయాలు
మార్చి 17న 2023-24 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. కేవలం ఉగాది..వారాంతపు సెలవు మినహా మిగిలిన అన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా లో శాసనమండలికి ఎన్నికైన ఏడుగురు సభ్యుల కాల పరిమితి మార్చి 29తో ముగియనుంది. వీరి ఎన్నికకు సంబంధించి మార్చి తొలి వారంలో నోటిఫికేషన్ విడుదల కానుంది.
సమావేశాల నిర్వహణ సమయంలో ఎన్నిక జరగనుంది. అధికార వైసీపీ ఇప్పటికే తమ అభ్యర్దులను ప్రకటించింది. శాసనసభలో సంఖ్యా బలం ఆధారంగా వైసీపీ సభ్యుల ఎన్నిన ఏకగ్రీవం అయ్యే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ పోటీకి దిగితే పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది.

విశాఖ నుంచి పాలనపై క్లారిటీ
ఈ సమావేశాల్లో రాజధాని పైన ప్రభుత్వ వైఖరి స్పష్టం అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో కట్టుబడి ఉంది. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలనే నిర్ణయంగా స్పష్టం అవుతోంది. మూడు రాజధానుల వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది.
దీంతో..కోర్టు తీర్పు వెలువడే వరకూ అధికారికంగా రాజధానుల విషయంలో నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపించటం లేదు. దీంతో..ముందుగా ముఖ్యమంత్రి జగన్ విశాఖ కేంద్రంగా తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్దం అవుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు.
ఈ సమావేశాల్లో విశాఖ నుంచి ముఖ్యమంత్రి పాలన...పరిపాలనా అంశాలకు సంబంధించి సభా వేదికగా కీలక ప్రకటకు రంగం సిద్దం అవుతున్నట్లు సమాచారం. ఇక..ఎన్నికల ఏడాది కావటంతో బడ్జెట్ లో ప్రతిపాదించే అంశాలు..ప్రకటనలు రాజకీయంగా .. పాలనా పరంగా కీలకం కానున్నాయి.












Click it and Unblock the Notifications