తగ్గేదే లే అంటున్న ఏపీ ప్రభుత్వం - సినిమా టిక్కెట్ల ధర పెంచేది లేదు : కోర్టు తీర్పు పై అప్పీల్ ...!!
సినిమా టిక్కెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం వెనక్కు తగ్గేది లేదంటోంది. ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల విషయంలో సెంటర్ల వారీగా టిక్కెట్లను ఖరారు చేసింది. అయితే ,ఈ టిక్కెట్ల ధరలు అమలు చేస్తే నష్టపోతామంటూ డిస్ట్రిబ్యూటర్లు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 35 రద్దు చేయాలని కోరారు. సినిమాల విడుదల సమయంలో టికెట్ రేట్లు పెంచుకునే హక్కు థియేటర్ల యాజమాన్యాలకు ఉంటుందని న్యాయవాదాలు వాదించారు.
జీవో సస్పెన్షన్ పై ప్రభుత్వం అప్పీల్
టికెట్ల ధరలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని కోర్టుకు నివేదించారు. పిటిషనర్ తరపు లాయర్ల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన జీవోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా సినిమా టిక్కెట్ల ధరలు గతంలో ఉన్న విధంగానే పెంచు కొనే అవకశం ఏర్పడింది. అయితే, దీని పైన ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో అప్పీల్ కు వెళ్లింది. దీనిని వెంటనే విచారించాలని కోరుతూ డివిజన్ బెంచ్ లో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది.
పట్టువీడని ఏపీ ప్రభుత్వం
గతంలోనే ప్రభుత్వం టిక్కెట్ల విషయంలో పునరాలోచించాలని మెగాస్టార్ చిరంజీవితో పాటుగా పలువురు టాలీవుడ్ ప్రముఖులు కోరారు. తాజాగా ఈ ఉదయం విజయవాడ ఇంద్రకీలాద్రి పైన అమ్మవారిని దర్శించుకున్న నందమూరి బాలయ్య సైతం ప్రభుత్వం ఈ వ్యవహారంలో అప్పీల్ కు వెళ్తుందని చెప్పుకొచ్చారు. తాము అఖండ మూవీని మాత్రం అన్నింటికీ సిద్దపడే విడుదల చేసామని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం తాము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండే అవకాశం స్పష్టం గా కనిపిస్తోంది.
భారీ బడ్జెట్ మూవీలపై ఎఫెక్ట్
డివిజన్ బెంచ్ కు అప్పీల్ కు వెళ్లటం ద్వారా తాము ఈ నిర్ణయంలో వెనక్కు వెళ్లే అవకాశం లేదని తేల్చి చెప్పినట్లు అవుతోంది. దీంతో.. ఇక, భారీ బడ్జెట్ సినిమాల విడుదల విషయంలో తాజా కోర్టు తీర్పుతో రిలీఫ్ గా భావించిన నిర్మాతలు..డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పుడు ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లటంతో అక్కడ ఎటువంటి తీర్పు వస్తుందనే ఉత్కంఠ కనిపిస్తోంది. డివిజన్ బెంచ్ తీర్పుకు అనుగుణంగా అటు ప్రభుత్వం..ఇటు డిస్ట్రిబ్యూటర్లు ఏ రకంగా ముందుకు వెళ్తున్నారనేది మరో ఆసక్తి కర అంశంగా మారుతోంది.