మంత్రులు - సలహాదారులు : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!!
సలహాదారుల నియామకం విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
సలహాదారుల నియామకం విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. సలహాదారుల నియామకం విషయంలో విధాన రూపకల్పనకు నిర్ణయించినట్లు హైకోర్టుకు నివేదించింది. దీని పైన మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోద ముద్ర వేస్తామని స్పష్టం చేసింది. ఇక నుంచి మంత్రులకు మాత్రమే సలహాదారులు సేవలు అందిస్తారని పేర్కొంది. ఈ దిశగా అమలు చేసే మార్గదర్శకాలను కోర్టు ముందు ఉంచింది.
ఏపీ ప్రభుత్వం ఇక నుంచి సలహాదారుల నియమాకంలో కొత్త విధి విధానాలు అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పలు అంశాలను పేర్కొంది. జ్వాలాపురపు శ్రీకాంత్ను దేవదాయశాఖ సలహాదారుగా నియమిస్తూ గత ఏడాది ఆగస్టు 5న ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ పిల్ దాఖలైంది. ఈ వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలా సలహాదారులను నియమించుకుంటూపోతే ఆ సంఖ్యకు పరిమితి ఉండదని, రేపటిరోజున జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు సైతం సలహాదారులను నియమిస్తారని వ్యాఖ్యానించింది. సలహాదారుల నియామకం విషయంలో రాజ్యాంగబద్ధతను తేలుస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున జీఏడీ ముఖ్యకార్యదర్శి రేవు ముత్యాలరాజు హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేశారు.

ఈ అఫిడవిట్ లో ఇకపై సలహాదారులుగా నియమితులయ్యేవారు మంత్రులకు మాత్రమే సేవలు అందిస్తారని పేర్కొంది. సలహాదారులను నియమించుకోవాలని మంత్రి భావిస్తే ముందుగా ముఖ్యమంత్రికి రాతపూర్వకంగా తెలియజేసి ఆమోదం పొందాల్సి ఉంటుందని వివరించింది. సలహాదారుల కాలపరిమితి రెండేళ్లుగా నిర్ణయించామని వెల్లడించింది. వారి పనితీరు ఆధారంగా మరో రెండేళ్లు పొడిగిస్తామంది. సలహాదారులు అవినీతి నిరోధక చట్టంలోని పబ్లిక్ సర్వెంట్ నిర్వచనం పరిధిలోకి వస్తారని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి సలహాదారులుగా ఉన్న వారికి తాజా నిర్ణయాలు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇప్పటికే కొనసాగుతున్న సలహాదారులను సంబంధింత మంత్రులకు సలహాదారులుగా రీడిజిగ్నేట్ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కొనసాగింపుగా.. సలహాదారులు నిర్వహించాల్సిన పాత్ర, బాధ్యతలను నిర్వచిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. విధానాల రూపకల్పనలో మంత్రులకు సలహాలివ్వడానికే సలహాదారులు పరిమితం అవుతారని పేర్కొంది. సివిల్ సర్వెంట్స్ రోజువారీ విధుల్లో వారి జోక్యం ఉండబోదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ రహస్యాలను బహిర్గతం చేయబోమని ప్రతి సలహాదారు అఫిడవిట్ పై సంతకం చేయాల్సి ఉంటుందని స్పష్టత ఇచ్చింది. ఎలాంటి వివాదాలు గోప్యంగా ఉంచాలో అఫిడవిట్లో ఉంటాయని వివరించింది.












Click it and Unblock the Notifications