అమ్మఒడికి కోత - అమల్లోకి కొత్త ఆంక్షలు : పథకం వర్తించాలంటే ఇలా..!!
సీఎం జగన్ మానస పుత్రిక అమ్మఒడి పథకం. నవరత్నాల్లో ప్రతిష్ఠాత్మకమైన పథకంగా జగన్ ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే, ఇప్పుడు ఈ పథకం నిర్వహణలో కొత్తగా కొన్ని ఆంక్షలు అమల్లోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. ఈ పథకం ద్వారా పాఠశాలకు వెళ్లే విద్యార్ధి తల్లి ఖాతాలో ప్రోత్సాహకం కింద ఒక విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు అందిస్తున్నారు. ఇందులో రూ.1,000ని పాఠశాలల ఆయాల జీతాల కోసం మినహాయించి మిగతా రూ.14 వేలు ఇస్తున్నారు. ఈ పథకాన్ని ఐదేళ్లపాటు అందిస్తానని ప్రభుత్వం ప్రకటించింది. తొలుత జనవరి మాసంలోనే దీని అమలుకు నిర్ణయించారు.
నవరత్నాల్లో ఆకర్షణీయ పథకంగా
ఒక ఏడాది అదే విధంగా అమలు చేసారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం..జూన్ - జూలై లో అమలు చేసే విధంగా క్యాలెండర్ ప్రకటించారు. తొలుత పాఠశాలకు వెళ్లే ప్రతీ విద్యార్ధికి ఈ పథకం వర్తిస్తుందని ప్రకటించారు. ఆ తరువాత ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు పరిమితం చేయాలని భావించారు. కానీ, ఆ ప్రతిపాదన పైన వ్యతిరేకత రావటంతో ప్రభుత్వ - ప్రయివేటు పాఠశాలల్లో చదువుకొనే అందరికీ దీనిని వర్తింప చేస్తూ..ఒక్కో కుటుంబానికి ఒక్క విద్యార్ధికి అందించేలా నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి గతంలోనే అమ్మఒడి కింద లబ్ధి పొందాలంటే 75శాతం హాజరు తప్పనిసరనే నిబంధన విధించారు. కొవిడ్ నేపథ్యంలో దాన్ని తొలినాళ్లలో పెద్దగా పట్టించుకోలేదు. ఆ షరతుకు మినహాయింపు ఇచ్చారు.
75 శాతం హాజరు ఉంటేనే..
కానీ ఈ విద్యా సంవత్సరంలో 75 శాతం హాజరు ఉన్నవారికే.. వచ్చే విద్యాసంవత్సరంలో అమ్మ ఒడి అందిస్తారు. ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. అమ్మఒడికి సంబంధించిన అర్హతలను పేర్కొన్న విద్యాశాఖ నవంబర్ 8 నుంచి ఏప్రిల్ 30 వరకు విద్యార్థి హాజరు 75 శాతం లేకపోయినా ప్రయోజనం పొందలేరని స్పష్టం చేసింది. బియ్యం కార్డు కొత్తది ఉండాలని, కొత్త జిల్లాల నేపథ్యంలో ఆధార్లో జిల్లాల పేరు మార్చుకోవాలని తెలిపింది. బ్యాంక్ ఖాతాల్ని ఆధార్తో లింక్ చేసుకోవడం సహా ఖాతాలు పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేసుకోవాలని సూచించింది. అదే సమయంలో మరో షాకింగ్ డెసిషన్ తీసుకుంది. విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటితే అమ్మఒడి పథకం ప్రయోజనం అందదని పేర్కొంది.
300 యూనిట్ల లోపు విద్యుత్ వాడకంతో లింకు
300 యూనిట్ల లోపు విద్యుత్ వాడకం ఉన్న వారికే ఈ పథకం వర్తిస్తోందని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను కట్టేవాళ్లకు అమ్మఒడి వర్తించదు. ప్రతీ ఏటా సుమారు 44 లక్షల మంది అమ్మఒడి పథకం కింద లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వ తాజా నిబంధనలతో ఈ సంఖ్య తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం లోగానే కొత్త నిబంధనల మేరకు అర్హులను గుర్తించి..జిల్లాల వారీగా జాబితాలు సిద్దం చేయాలని ఆదేశించారు. దీంతో..వాలంటీర్లు తాజా నిబంధనల మేరకు లబ్ది దారులను ఖరారు చేయాల్సి ఉంటుంది.