గంజాయి నిర్మూలనకు ఏపీ సర్కార్ పరివర్తన కార్యక్రమం: గంజాయి క్షేత్రాల ధ్వంసం; మార్పు సాధ్యమేనా?
జగన్ సర్కార్ గంజాయి నిర్మూలన పై దృష్టి సారించిందా? గంజాయి సాగు విచ్చలవిడిగా జరుగుతుందని, గంజాయి సాగును ధ్వంసం చేయడం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుందా? ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గంజాయిని సమూలంగా నాశనం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన క్రమంలో అధికారులు గంజాయి క్షేత్రాలను ధ్వంసం చేయడానికి రంగంలోకి దిగారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. పరివర్తన కార్యక్రమం ద్వారా గంజాయి నిర్మూలనకు శ్రీకారం చుట్టిన జగన్ సర్కార్ విశాఖ ఏజెన్సీ ని లక్ష్యంగా చేసుకొని గంజాయి పంట నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా, ప్రజలలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తుంది.
దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా మూలాలు ఏపీలోనే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా సాగుతున్న విషయం తెలిసిందే. విశాఖ ఏజెన్సీ కేంద్రంగా వేల ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి గంజాయి ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా జరుగుతుందని దేశవ్యాప్త చర్చ జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీలు ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ గంజాయి సాగు పై, గంజాయి హబ్ గా ఏపీ మారుతున్న తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఇక ఇతర రాష్ట్రాలలో పట్టుబడ్డ గంజాయి సైతం మూలాలు ఏపీ లోనే ఉండడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రంగా గంజాయి మాఫియా పెద్ద ఎత్తున దందా సాగిస్తుందన్న ఆరోపణలకు ఊతమిస్తూ రోజుకో ఘటన వెలుగులోకి వస్తుంది.
గంజాయిపై ఉక్కుపాదం మోపటానికి పరివర్తన కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గంజాయిపై ఉక్కు పాదం మోపడానికి రెడీ అయింది. గంజాయి అక్రమ రవాణా అరికట్టడానికి విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన జగన్ సర్కార్ విశాఖ ఏజెన్సీ కేంద్రంగా గంజాయి సాగు చేస్తున్న క్షేత్రాలపై దాడులు చేయాలని నిర్ణయించింది. గంజాయి తోటలను ధ్వంసం చేసి, గంజాయిని సాగు చేస్తున్న ప్రజలలో మార్పు తీసుకురావడానికి పరివర్తన కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా ఏజెన్సీ లో గంజాయి తోటలో నిర్మూలనకు నడుంబిగించారు అధికారులు.వివిధ శాఖల సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పరివర్తన కార్యక్రమాన్ని ప్రారంభించిన అధికారులు జి.మాడుగుల మండలంలో గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు.
విశాఖ జి.మాడుగుల మండలంలో గంజాయి క్షేత్రాలపై దాడులు
శనివారం ఎస్పీ కృష్ణా రావు ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు జి.మాడుగుల మండలంలో గంజాయి క్షేత్రాలపై దాడులు చేసి గంజాయి పంటలను ధ్వంసం చేశారు. గంజాయి ఎక్కడ సాగవుతుందో తెలుసుకుని ఆ ప్రాంతాల్లోని ప్రజలకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. గంజాయి సాగు చేయడం మానవాళి మనుగడకే ప్రమాదమని, గంజాయిని సాగు చేసే బదులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని గిరిజనులకు సూచిస్తున్నారు. జి.మాడుగుల మండలం పాలమామిడి పంచాయతీ ఏడు చావళ్ళు, చీకుంబంధ గ్రామాల సమీపంలో శనివారం ఒక రోజే దాదాపు 80 ఎకరాల్లోని గంజాయి తోటలను పోలీసులు, స్థానికులు కలిసి ధ్వంసం చేశారు.
స్థానికులతో కలిసి గంజాయి క్షేత్రాలపై పోలీసుల దాడులు
డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు రెవెన్యూ, అటవీ, ఐటీడీఏ అధికారులతో కలిసి పోలీసులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు గంజాయి క్షేత్రాల ధ్వంసానికి రంగంలోకి దిగారు. స్థానికులలో కూడా చైతన్యం తీసుకువచ్చి వారు కూడా గంజాయి సాగును ధ్వంసం చేసేలా చేశారు. కొన్ని గ్రామాలలో గ్రామస్తులు స్వచ్ఛందంగా గంజాయి తోటలను తొలగించారు.
గంజాయి సాగు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పిన అధికారులు విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగును భౌతికంగా గుర్తించి సమూలంగా నిర్మూలించడం కోసం శాటిలైట్ చిత్రాలు, డ్రోన్లు, జిపిఎస్ వంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తామని గంజాయి సాగును సమగ్రంగా నిర్మూలిస్తామని వెల్లడించారు. ప్రజలలో కూడా మార్పు రావాలని గంజాయి సాగు చేయకూడదని పోలీసులు పేర్కొన్నారు.
గంజాయి సాగు విశాఖ ఏజెన్సీలో సామాజిక, ఆర్ధిక అంశం
ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం గంజాయి నిర్మూలనకు ప్రారంభించిన పరివర్తన కార్యక్రమం ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది. గంజాయి సాగు విశాఖ ఏజెన్సీలో సామాజిక ఆర్థిక అంశమని ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంటి నాయకులు కూడా వెల్లడించారు. గంజాయి సాగు చాలా కాలంగా అక్కడి ప్రజల జీవనాధార సాగుగా మారిందని, ఏజెన్సీ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, ఉపాధి మార్గాలు కనిపించకపోవడంతో వారంతా గంజాయి బాట పట్టారని వెల్లడించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఏపీ గంజాయి సాగుపై మాఫియా దృష్టి పడిందని కూడా వ్యాఖ్యానించారు.
సమస్య మూలాలలోకి వెళ్లి పరిష్కరిస్తేనే గంజాయి నిర్మూలన సాధ్యం
ప్రభుత్వం పరివర్తన కార్యక్రమం ద్వారా కేవలం గంజాయి క్షేత్రాల సాగును ధ్వంసం చేస్తే సరిపోదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది . మళ్లీ గంజాయి సాగు చేయకుండా వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపించాల్సిన అవసరం ఉంది. వారిలో సామాజిక చైతన్యాన్ని కలిగించేలా ప్రయత్నించాలని, వారి వెనుకబాటుతనాన్ని దూరం చేసేలా చర్యలు చేపడితే గంజాయి సాగును కాస్తయినా కట్టడి చేసే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయకుండా ప్రస్తుతం వ్యక్తమవుతున్న ఆందోళనల నేపథ్యంలో, ప్రతిపక్షాల ఆరోపణలతో తూతూమంత్రంగా సమస్య మూలాలలోకి వెళ్లకుండా గంజాయి సాగును ధ్వంసం చేస్తే సరిపోదు. ఏపీ ప్రభుత్వ కనుసన్నలలోనే గంజాయి సాగు జరుగుతుందన్న ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టాలంటే సమస్య మూలాల్లోకి వెళ్ళి పూర్తిస్థాయిలో గంజాయి నిర్మూలించడమే పరిష్కారం.