ఏపీలో రోడ్లపైకి లారీలు, గూడ్స్ వాహనాలు.. ప్రయాణికుల్ని తీసుకెళ్ళొద్దని షరతు...
ఏపీలో దాదాపు మూడు వారాలుగా గ్యారేజ్ లు, ఆటోనగర్లకే పరిమితమైన సరుకు రవాణా వాహనాలు తిరిగి రోడ్డెక్కనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా రవాణా నిలిచిపోయిన నేపథ్యంలో నిత్యావసర సరుకుల రవాణాకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో కేంద్రం సరకు రవాణా వాహనాలను కొన్ని పరిమితులతో అనుమతించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కేంద్రం నుంచి ఆదేశాలు రావడంతో ఏపీ ప్రభుత్ం కూడా రవాణా వాహనాలకు అనుమతి ఇచ్చింది.

గూడ్స్ వాహనాలకు గ్రీన్సిగ్నల్ ..
కేంద్రం విధించిన మార్గదర్శకాల మేరకు ఏపీలో సరకు రవాణా వాహనాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ్టి నుంచి లారీలు, ఇతర సరకు రవాణా వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పటివరకు అత్యవసర సరుకులను రవాణా చేసే వాహనాలకు మాత్రమే అనుమతి ఉంది. తాజాగా ఇతర అన్ని రకాల రవాణా వాహనాలకు కూడా అనుమతులు ఇవ్వటంతో లారీలు రోడ్లపైకి ప్రవేశిస్తున్నాయి.

అన్ని గూడ్స్ వాహనాలకు అనుమతి
సరకులను రవాణా చేసే అన్ని రకాల వాహనాలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో లారీలతో పాటు ట్రక్కులు, ప్లాట్ ఫామ్ ఆటోలు, ఇతర సరకు రవాణా వాహనాలు కూడా ఉన్నాయి. సరకు రవాణాకు సంబంధించిన వివరాలను తమ వద్ద ఉంచుకుని దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లేలా వీరికి అనుమతి ఇచ్చారు. వీరు ఇకపై చెక్ పోస్టుల వద్ద పోలీసులకు ఎలాంటి పాసులు చూపించాల్సిన అవసరం లేదు. లోడింగ్, అన్ లోడింగ్ ను దృష్టిలో ఉంచుకుని సరకులు లేకుండా కూడా ఖాళీగా వెళ్లేందుకు వీలు కల్పించారు. పాసులు ఇస్తే తప్ప రవాణా వాహనాలకు అనుమతి ఉండదన్న అపోహల కారణంతో చాలామంది బుకింగ్లు చేసుకోవటానికి ఆలోచిస్తున్నారు. దీంతో ఆశించినంతగా బుకింగ్లు జరగటం లేదని తెలుస్తోంది.
దీంతో డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ అనుమానాలకు తెరదించారు. అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులకు రవాణా వాహనాల అనుమతులకు సంబంధించి ఫ్యాక్స్/రేడియో మెసేజ్ను పంపారు.

ప్రయాణికులను ఎక్కించుకునే వీల్లేదు
ప్రజలకు కావాల్సిన ఏ నిత్యావసర సరుకు అయినా సాధారణ సరుకులు అయినా రవాణా చేసేందుకు వాహనాలకు వీలు కల్పించిన ప్రభుత్వం.. ప్రయాణికులను మాత్రం చేరవేయొద్దని ఆంక్షలు విధించింది. వీటిని ఉల్లంఘించి ప్రయాణికులను తరలిస్తున్నట్లు తేలితే లాక్ డౌన్ నిబంధనల మేరకు జరిమానాలు, జైలు శిక్షలు తప్పవని హెచ్చరిస్తోంది.
ఏ రకమైన గూడ్స్ రవాణా వాహనాల్లో అయినా కేవలం డ్రైవర్, క్లీనర్ మాత్రమే ఉండాలని, ప్రయాణికులను తరలించటాన్ని మాత్రం అనుమతించవద్దని ప్రభుత్వం చెబుతోంది.












Click it and Unblock the Notifications