జపాన్ లో ఏపీ రోడ్ షో - సీఎం నేతృత్వంలో : దావోస్ తరువాత - శ్రీసిటీ సమీపంలో కొత్తగా..!!
ఏపీలో పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రభుత్వం కొత్త అడుగులు వేస్తోంది. ఈ నెల 22 నుంచి ముఖ్యమంత్రి జగన్ టీమ్ దావోస్ లో జరిగే ప్రపంచ వాణిజ్య సదస్సులో పాల్గొంటోంది. 26వ తేదీ వరకు దాదాపు 30 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ఏపీ టీం సమావేశం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ సైతం సిద్దమైంది. ముఖ్యమంత్రి జగన్ తో పాటుగా ఆర్దిక మంత్రి బుగ్గన.. పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాధ్ దావోస్ వెళ్లనున్నారు. ఇక, త్వరలోనే జపాన్ సంస్థల పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది.
జపాన్ లో ఏపీ రోడ్ షో
త్వరలో జపాన్లో రోడ్ షో నిర్వహించనున్నట్లు ఏపీఈడీబీ (ఏపీ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు) సీఈఓ జవ్వాది సుబ్రమణ్యం వెల్లడించారు. జపాన్కు చెందిన పారిశ్రామిక, బ్యాంకింగ్ రంగ ప్రతినిధుల బృందం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో సుబ్రమణ్యంను కలిసి రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై ఆసక్తిని వ్యక్తంచేశారు. జపాన్ పెట్టుబడులకు రాష్ట్రం అనువైనదని, ఇప్పటికే ఆ దేశానికి చెందిన పలు కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టగా.. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం కోసం ప్రణాళిక సిద్ధంచేస్తున్నట్లు చెప్పారు.
సీఈఓలతో త్వరలో రాష్ట్రంలో రౌండ్టేబుల్
అలాగే, రాష్ట్రంలోని జపాన్ కంపెనీల సీఈఓలతో త్వరలో రాష్ట్రంలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్నారు. విశాఖపట్నంలో జపాన్కు చెందిన యొకొహమ గ్రూపునకు చెందిన ఏటీజీ టైర్స్ భారీ టైర్ల తయారీ యూనిట్ను ఏర్పాటుచేస్తుండటమే కాకుండా ఆ యూనిట్కు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఇదే సమయంలో.. శ్రీసిటీకి 25 కి.మీ దూరంలో ప్రత్యేకంగా జపనీస్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ (జిట్)ను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వెల్లడించారు.
శ్రీసిటీ సమీపంలో జిట్ ఏర్పాటు
ప్రత్యేకంగా జపాన్ కంపెనీలకే హెల్ప్డెస్క్ వెసులుబాటుతో పాటు శ్రీసిటీలో జపనీస్ భాష అనువాదకులనూ ఏర్పాటుచేశామని చెప్పారు. దక్షిణాదిలో వాణిజ్యపరంగా ఏపీ అన్నింటికి అనువైన రాష్ట్రంగా ఎంయూఎఫ్జీ బ్యాంకు చెన్నై బ్రాంచ్ అధ్యక్షులు యుకిహిరో చెప్పారు. ఇక, ఇప్పటి వరకు పూర్తిగా సంక్షేమం పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టిన ఏపీ ప్రభుత్వం..దావోస్ - జపాన్ పర్యటనల ద్వారా ఏపీలో పెట్టుబడుల ఆకర్షణ దిశగా చేస్తున్న ప్రయత్నాలు ఏ మేర సక్సెస్ అవుతాయనేది చూడాలి.