మరో ఎన్నికల హామీ అమలు, 50 ఏళ్లకే వారికి పెన్షన్- ముహూర్తం ఫిక్స్..!!
ఏపీలో కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలుకు సిద్దం అయింది. రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న వేళ.. మరో హామీ అమలు దిశగా కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఆర్ధికంగా భారం.. నిర్వహణ పైన పూర్తి సమాచారం సేకరించింది. కూటమి అధికారంలోకి వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్లు అందిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఈ హామీ అమలు దిశగా నిర్ణయం తీసుకుంది. వచ్చే కేబినెట్ భేటీలో అధికారికంగా ఆమోద ముద్ర వేసేందుకు రంగం సిద్దమైంది.
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు పైన నిర్ణయం తీసుకుంది. కొత్తగా 15 లక్షల పింఛన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 60 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్లు మంజూరుచేయడంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకు పెన్షన్ ఇస్తామని గత ఎన్నికల్లో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ అమలు పై తుది కసరత్తు జరుగు తోంది. ఇప్పటికే రాష్ట్రంలో 62.47 లక్షల మంది సుమారు 28 రకాల పెన్షన్లు అందుకుంటు న్నారు. కొత్తగాచేరే లబ్ధిదారులతో కలిపి ఈ సంఖ్య 77 లక్షలకు చేరనుంది. కూటమి ప్రభుత్వం లో ప్రతి నెలా రూ.2720.67 కోట్లు పెన్షన్ల కోసం కేటాయిస్తున్నారు. ప్రతి నెలా ఇకపై అదనంగా రూ.700 కోట్ల వ్యయమవుతుందని అంచనా. దీనివల్ల ఏటా అదనంగా రూ.8400 కోట్ల అదనపు భారం పడనుంది. ఏటా ఎన్టీఆర్ భరోసా కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.41 వేల కోట్ల నిధులు వెచ్చిస్తోంది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తదితరులకు ఇంత భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయించడం దేశంలోనే రికార్డుగా పేర్కొంటున్నారు.

రెండేళ్ల పాలన పూర్తవుతున్న వేళ నిర్ణయం
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కానుంది. దీంతో.. ఈ హామీ అమలు దిశగా ఆర్దిక శాఖ అధికారులు పూర్తి వివరాలు సేకరించారు. అదే విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత నెలకు రూ 4 వేలు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. వాలంటీర్ల స్థానంలో సచివాలయ సిబ్బందితో ఈ పెన్షన్లను అందిస్తున్నారు. అదే విధంగా ఇతర కేటగిరీల పెన్షన్లు పెంచి అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల హామీ అమల్లో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో 50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్లు మంజూరు చేయనున్నారు. అదే విధంగా 60 ఏళ్లు నిండిన వారికి కొత్తగా పెన్షన్లు ఇవ్వాలని భావిస్తున్నారు. దీంతో... మొత్తంగా 15 లక్షల వరకు లబ్ది పొందే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తుది కసరత్తు పూర్తి చేసి ఈ సారి జరిగే కేబినెట్ భేటీలో అధికారికం గా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications