అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వెనక్కి: వాయిదా వేసే యోచనలో జగన్ సర్కార్
అమరవాతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో అనూహ్య నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను వాయిదా వేసే దిశగా ఆయన యోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించి తీరాలనే పట్టుదలతో ఉన్న ఆయన అసెంబ్లీ సమావేశాలను సైతం వెనక్కి జరపడానికి వెనుకాడకపోవచ్చని తెలుస్తోంది. దీనిపై మంత్రివర్గ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు.
నక్క తోక తొక్కిన టీడీపీ ఎంపీ: ఆయన కంపెనీలో వంద కోట్ల పెట్టుబడి: తైవాన్ సంస్థ రెడీ: చిత్తూరులో యూనిట్
15న బడ్జెట్ సమవేశాలు ఆరంభం కావాల్సి ఉన్నా..
ముందుగా వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 15వ తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభం కావాల్సి ఉంది. ఆ మరుసటి రోజే ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను సభ ముందు ఉంచాల్సి ఉంది. నెలరోజుల పాటు సమావేశాలను నిర్వహిస్తామని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదివరకే ప్రకటించింది. అదే సమయంలో- స్థానిక సంస్థలకు ఎన్నికలను నిర్వహించాల్సిన పరిస్థితులు ఎదురుకావచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
ఎన్నికల నిర్వహణకే మొగ్గు..
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించడం కంటే కూడా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకే వైఎస్ జగన్ మొగ్గు చూపుతున్నారని, ఈ నెల రోజుల వ్యవధిలో ఈ పక్రియ పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల్లో ప్రజా ప్రభుత్వ ఏర్పడేలా చర్యలు తీసుకుంటామని, ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత జిల్లా పాలనా, పోలీసు యంత్రాంగంపై ఉందంటూ ఆయన కలెక్టర్ల సమావేశంలో స్పష్టం చేయడం.. ఆయన వైఖరి ఏమిటో స్పష్టం చేస్తోందని అంటున్నారు. బడ్జెట్ సమావేశాలను వాయిదా వేసే అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని, మెజారిటీ మంత్రుల అభిప్రాయాలను విన్న తరువాత తన నిర్ణయాన్ని జగన్ దీనిపై ఓ నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
గ్రామస్థాయిలో అభివృద్ధి కుంటు..
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కంటే స్థానిక సంస్థలకు ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ రావడం వల్ల గ్రామ, పట్టణ పరిపాలన దాదాపు నిర్వీర్యంగా తయారైందనే అభిప్రాయం అధికార పార్టీ పెద్దల్లో వ్యక్తమౌతోంది. స్థానిక సంస్థల్లో అధికారుల పాలన కొనసాగుతూ వస్తోందని, ఫలితంగా క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన గానీ, అభివృద్ధి పనులు గానీ స్తంభించిపోయాయనే భావన నెలకొంది.
కేంద్రం నుంచి రూ.3000 కోట్లకు బ్రేక్..
రాష్ట్రంలో పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రజా ప్రభుత్వం లేనందున.. వాటికి కేటాయించాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే. ఫలితంగా- 3000 కోట్ల రూపాయలు కేంద్రం వద్ద మురిగిపోతున్నారు. వాటిని విడుదల చేయించుకోవాలంటే స్థానిక సంస్థలకు ఎన్నికలను నిర్వహించి తీరాల్సిన పరిస్థితిని ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ఎన్నికలను నిర్వహించడానికి అధికార పార్టీ చేస్తోన్న ప్రయత్నాలన్నీ న్యాయస్థానాల గడప తొక్కుతున్నాయి.. వేర్వేరు రూపాల్లో.
Recommended Video
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా..
స్థానిక సంస్థలకు ఎన్నికలను నిర్వహించకుండా తెలుగుదేశం పార్టీ అడ్డు పడుతోందంటూ అధికార పార్టీ నాయకులు ఆరోపిస్తూ వస్తున్నారు. ఆ ఆరోపణలకు కౌంటర్ ఇస్తోంది తెలుగుదేశం. ఈ పరిస్థితుల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కంటే.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అందుబాటులో గల అన్ని మార్గాలను అన్వేషించుకోవాల్సి ఉంటుందని, సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసి, ఏకపక్షంగా విజయం సాధించాలని వైఎస్ జగన్ మంత్రివర్గ సహచరులకు సూచించినట్లు చెబుతున్నారు.