స్ధానిక ఎన్నికల కారణంగా ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ కారణంగా ఈ నెల 23 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చింది. పదో తరగతి పరీక్షలను ఏప్రిల్ నెలలో నిర్వహించే అవకాశముంది.
స్ధానిక ఎన్నికలతో పదోతరగతి పరీక్షల వాయిదా
ఏపీలో ఈ నెల 23 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను స్ధానిక సంస్ధల ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసుకుంటున్నట్లు ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చింది. ఈ విషయాన్ని ఇవాళ రాజకీయ పార్టీలతో సమావేశం తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. రేపోమాపో కొత్త తేదీలను ఖరారు చేశాక ప్రభుత్వం దీనిపై ఓ ప్రకటన చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

21, 24 తేదీల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఈ నెల 21, 24 తేదీల్లోనూ, మున్సిపల్ ఎన్నికలను ఈ నెల 27న నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుదలైంది. అదే సమయంలో ఈ నెల 23 నుంచి పదో తరగతి పరీక్షలు మొదలు కావాల్సి ఉంది. అసలే ఎన్నికల సీజన్ కావడంతో పదో తరగతి పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్ధులకు ప్రిపరేషన్ లో ఇబ్బందులు ఎలాగో తప్పవు. కనీసం పరీక్షలు అయినా వాయిదా వేస్తే ఊరట లభిస్తుందని తల్లితండ్రులు ఇప్పటికే భావిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మేరకు ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నెలలో పరీక్షలు నిర్వహించేలా కొత్త షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది.












Click it and Unblock the Notifications