తిరుమల తరహాలో మరో ప్రఖ్యాత ఆలయం అభివృద్ధి- మాస్టర్ ప్లాన్ ప్రిపేర్..!!
నంద్యాల జిల్లాలో వెలిసిన ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దేవస్థానాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేసింది.
అమరావతి: కలియుగ వైకుంఠంలా అలరారుతున్న ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల. రోజూ వేలాదిమంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకుంటుంటారు. తలనీలాలను సమర్పిస్తుంటారు. భక్తిశ్రద్ధలతో మొక్కులను చెల్లించుకుంటుంటారు. పండగలు, బ్రహ్మోత్సవాలు, వారంతపు సెలవురోజుల్లో తిరుమలేశుడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సంఖ్య లక్షకు దాటిపోతుంటుంది.
అయినప్పటికీ- ఏ ఒక్క భక్తుడు కూడా స్వామివారిని దర్శించుకోకుండా వెనక్కి వెళ్లని విధంగా అక్కడి వసతులను అభివృద్ధి చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అక్కడ మౌలిక వసతులను అభివృద్ధి చేసింది. భక్తులకు నివాస వసతి, అన్నప్రసాద వితరణ, క్యూలైన్లు, తిరుమాడా వీధుల నిర్మాణం.. టీటీడీ పనితీరుకు అద్దంపడుతుంది.

ఇప్పుడలాంటి వసతులను నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ ను రూపొందించింది. శనివారమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఈ మాస్టర్ ప్లాన్ పై సమీక్ష నిర్వహించారు. దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి, దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్లాల్, శ్రీశైలం ఆలయ కార్యనిర్వహణాధికారి లవన్న, దేవదాయశాఖ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ద్రోణ కన్సల్టెన్సీ, క్రియేటివ్ కన్సల్టెన్సీ సంస్థలు ఈ మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తోన్నాయి. వచ్చే 30 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ రూపొందించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు సౌకర్యాల కల్పన, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
క్యూ కాంప్లెక్స్ నిర్మాణం, అవసరమైన చోట్ల అంతర్గత రహదారుల విస్తరణ, సామాన్య భక్తులకు వసతి, దాతల సహకారంతో కాటేజీల నిర్మాణం, వాహనాల పార్కింగ్, విద్యుద్దీకరణ, ప్రాచీన కట్టడాల పరిరక్షణ మొదలైన అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని, వాటన్నింటికీ ప్రాధాన్యత ఇస్తూ మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని సూచించారు. బయలు వీరభద్రస్వామి వీధులను తిరుమల మాడ వీధులుగా అభివృద్ధి చేయాలని అన్నారు.
ప్రతి సంవత్సరం శివరాత్రి ఉత్సవాలు, రథోత్సవం, ప్రభల వేడుకలు, స్వామివారి వాహన సేవలను భక్తులు తిలకించడానికి వీలుగా ప్రత్యేక గ్యాలరీలను నిర్మించాల్సి ఉంటుందని సూచించారు. నెలరోజుల వ్యవధిలో ఈ సమగ్ర మాస్టర్ ప్లాన్ కు తుదిరూపాన్ని ఇవ్వాల్సి ఉంటుందని డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.












Click it and Unblock the Notifications