ఏపీలో రెడీ అవుతున్న కరోనా సేఫ్ టన్నెల్స్- ముందు జాగ్రత్త కోసమేనా ?
కరోనా వైరస్ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రెడ్ జోన్లకు సమీపంలో అత్యవసర క్వారంటైన్ సొరంగాలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. తాత్కాలిక ప్రాతిపదికన వీటిని సిద్ధం చేస్తున్నారు. కోవిడ్ 19 లక్షణాలు కనిపించిన వారికి ఆస్పత్రులకు తీసుకెళ్లకుండానే ఇక్కడే క్వారంటైన్ అందించేందుకు ఇందులో ఏర్పాట్లు చేస్తున్నారు.

కరోనా సేఫ్ టన్నెల్స్..
ఏపీలో కరోనా వైరస్ ప్రస్తుతానికి అదుపులోనే ఉంది. అయితే స్టేజ్ 3లోకి ప్రవేశిస్తుందన్న వార్తల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం పలు చోట్ల సేఫ్ టన్నెల్స్ ను సిద్ధం చేస్తోంది. తాత్కాలిక టెంట్ల రూపంలో ఉండే ఈ సేఫ్ టన్నెల్స్ లో అప్పటికప్పుడు గుర్తించిన కోవిడ్ 19 రోగులకు క్వారంటైన్ అందించనున్నారు.

రెడ్ జోన్లు పెరుగుతున్న చోట...
ఏపీలో ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో రెడ్ జోన్లు పెరుగుతున్నాయి. వీటిలో కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలోనూ అదనపు రెడ్ జోన్ల అవసరం కనిపిస్తోంది. దీంతో రెడ్ జోన్లు ఒక్కసారిగా పెంచాల్సి వస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆస్పత్రులు సరిపోవు. అలాగని ప్రతీ ఒక్కరినీ కోవిడ్ 19 ప్రత్యేక ఆస్పత్రులకు తరలించే పరిస్ధితి లేదు. దీంతో తాత్కాలిక ప్రాతిపదికన క్వారంటైన్ అందించేందుకు వీలుగా ప్రభుత్వం సేఫ్ టన్నెల్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆస్పత్రులు సరిపోకపోతే...
ఏపీలో ప్రస్తుతం కరోనా రోగులుగా గుర్తించిన వారికి సాధారణ లక్షణాలు ఉంటే లేదా అనుమానాస్పదంగా కనిపిస్తే వారిని క్వారంటైన్ కు తరలిస్తున్నారు. తీవ్ర లక్షణాలు ఉన్న వారిని మాత్రం కోవిడ్ 19 ప్రత్యేక ఆస్పత్రులకు పంపి ఐసోలేషన్ వార్డుల్లో ఉంచుతున్నారు. కానీ పరిస్ధితిలో ఒక్కసారిగా మార్పు వచ్చి అత్యవసరమైతే... ఎక్కడికక్కడ తాత్కాలిక ఏర్పాట్లు తప్పవు. దీంతో ప్రభుత్వం సేఫ్ టన్నెల్స్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తక్కువ ఖర్చుతో అత్యవసర పేషెంట్లకు క్వారంటైన్ అందించేందుకు వీలుగా ఇందులో ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా డీజీపీ సవాంగ్ గుంటూరులో ఓ టన్నెల్ ప్రారంభించగా.. ఇవాళ ప్రభుత్వ సలహాదారు సజ్జల మరో టన్నెల్ ప్రారంభించారు.












Click it and Unblock the Notifications