రూ99 మద్యం అమ్మకాలకు బ్రేక్ - బార్లకు కొత్త నిబంధనలు, ఉత్తర్వులు..!!
ఏపీలో నూతన బార్ల పాలసీ ఖరారైంది. కొత్త మార్గదర్శకాలను ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. కొత్త పాలసీ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. సుదీర్ఘ కసరత్తు తరువాత ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఆదాయం పెంపుతో పాటుగా గతంలో ఉన్న విధానాల్లో మార్పులు చేస్తూ ఈ పాలసీ విడుదల చేసారు. ఇదే సమయంలో మద్యం విక్రయ వేళలను పెంచుతూ వెసులుబాటు కల్పించారు.
నూతన పాలసీ
ఏపీ ఎక్సైజ్ శాఖ నూతన బార్ పాలసీని ప్రకటించింది. ఈ కొత్త బార్ పాలసీ సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. మూడేళ్ల పాటు ఈ పాలసీ అమల్లో ఉండనుంది. దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖ పాలసీ, రూల్స్పై వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. గత పాలసీలో వేలం విధానంలో బార్లు కేటాయించగా, ఇప్పుడు లాటరీ విధానంలో కేటాయించనుంది. 840 బార్లకు ప్రస్తుతం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. గీత కులాల వారికి మరో 10 శాతం అంటే.. 84 బార్లకు తర్వాత విడిగా నోటిఫికేషన్ ఇస్తుంది. దీంతో రాష్ట్రంలో కొత్తగా 84 బార్లు పెరగనున్నాయి. అలాగే బార్ల పనివేళలను రెండు గంటలు పెంచింది.

వేళల పెంపు
ఇదే సమయంలో బార్ల వేళలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు బార్లు పనిచేస్తున్నాయి. కొత్త పాలసీలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ పనిచేస్తాయి. అయితే లాటరీ విధానంలో దరఖాస్తుల పరిమితిపై నిబంధన పెట్టింది. ఒక్కో బార్కు కనీసం నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ తీస్తారు. ఒక దరఖాస్తుకు రూ.5 లక్షలు నాన్ రిఫండబుల్ ఫీజుగా నిర్ణయించింది. అదనంగా మరో రూ.10 వేలు చెల్లించాలి. లైసెన్స్ ఫీజును మూడు కేటగిరీల్లో నిర్ణయించింది. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, పర్యాటక శాఖ గుర్తించిన పర్యాటక ప్రాంతాల్లో మాత్రమే లైసెన్సీలు బార్లు ఏర్పాటు చేయాలి.
రూ 99 మద్యం ఉండదు
ఇక, జనాభా ఆధారంగా ధరలు ఖరారు చేసారు. 50 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.35 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల వరకు జనాభా ఉంటే రూ.55 లక్షలు, 5 లక్షల దాటిన చోట్ల రూ.75 లక్షలుగా ఖరారు చేసింది. కాగా గీత కులాలకు కేటాయించే బార్లకు అందులో 50 శాతం మాత్రమే లైసెన్స్ ఫీజుగా ఉంటుంది. ఏటా 10 శాతం ఫీజు పెరుగుతుంది. కూటమి ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన క్వార్టర్ రూ.99 మద్యం బార్లలో అమ్మకానికి అవకాశం లేదని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. అయితే, విమానాశ్రయాల్లోనూ బార్లు ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే తిరుపతి విమానాశ్రయం ఇందుకు మినహాయింపు. విమానాశ్రయాల్లో బార్లపై ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీచేస్తారు. బార్లకు దరఖాస్తులను ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు రూపాల్లోనూ స్వీకరించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది.












Click it and Unblock the Notifications