విన్నపాలు వినవలె..రైతుల కోసం ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెల్ల బంగారాన్ని సాగు చేసిన రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఏపీలో పలు ప్రాంతాలలో పత్తిని సాగు చేసిన రైతులు ఇటీవల వచ్చిన తుఫాను ప్రభావంతో నష్టపోగా, మార్కెట్లోకి పత్తిని తీసుకు వెళితే కొనుగోలు చేసే పరిస్థితి లేదని వాపోతున్నారు. కేంద్రం తీసుకు వచ్చిన కపాస్ కిసాన్ యాప్ వినియోగం పైన అవగాహన లేకపోవడంతో కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
రైతుల సమస్యలపై కేంద్రానికి లేఖ
ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారం కోసం కేంద్రానికి లేఖ రాసింది. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ మేరకు కేంద్ర టెక్స్టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కు లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన ఏపీలో పత్తి రైతుల పరిస్థితిని కళ్ళకు కట్టినట్టు చెప్పి, వారి సమస్యల పరిష్కారానికి కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

తుఫాను ప్రభావంతో రైతుల ఇబ్బంది ఇలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొంథా తుఫాన్ ప్రభావంతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతిందని, రైతులు కనీస మద్దతు ధర (MSP) కంటే తక్కువ ధరలకు పత్తి అమ్ముకోవాల్సి వస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో 2025-26 ఖరీఫ్ సీజన్లో 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేశారని 8 లక్ష మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఆ యాప్ తో రైతులకు ఇబ్బంది
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే CM APP మరియు ఆధార్ ఆధారిత e-పంట వ్యవస్థ ద్వారా పత్తి కొనుగోళ్లు డిజిటల్ విధానంలో నిర్వహిస్తోందని తెలిపారు.మరోవైపు కేంద్రం ప్రవేశపెట్టిన Kapas Kisan App ను రాష్ట్ర CM APP తో అనుసంధానం చేసిన తర్వాత సాంకేతిక సమస్యలు తలెత్తి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.
ఆ జిన్నింగ్ మిల్లులను ఒకేసారి ప్రారంభించేలా చర్యలకు ఆదేశం
ఇదే క్రమంలో కపాస్ కిసాన్ యాప్ నుండి సీఎం యాప్ కు రైతుల వివరాలు రియల్ టైంలో సమన్వయం అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. పత్తిని విక్రయించుకునేందుకు రైతులకు ఇబ్బంది లేకుండా సమీప జిల్లాలోని జిన్నింగ్ మిల్లులలో పత్తి విక్రయించుకునేలా మ్యాపింగ్ చేయాలన్నారు. రైతులు దూరప్రాంతాలకు వెళ్లకుండా. L1, L2, L3 జిన్నింగ్ మిల్లులను ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ చర్యలు తీసుకోండి
కేంద్రం తీసుకువచ్చిన Kapas Kisan App కోసం గుంటూరులో ప్రత్యేక సాంకేతిక సిబ్బందిని నియమించాలని పేర్కొన్నారు. వాతావరణ ప్రభావం వల్ల తేమ శాతం 12 నుండి 18% వరకు ఉన్న పత్తిని అనుపాత తగ్గింపులతో కొనుగోలు చేయాలని ఆయన పేర్కొన్నారు. వర్షానికి తడిసిన పత్తిని, రంగు మారిన పత్తిని కూడా తక్కువ ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రైతులను ఆదుకోవటంలో కేంద్రం తక్షణ సహకారం అవసరం
ఈ చర్యలతో రైతులలో అసంతృప్తి తగ్గి, ఆర్థిక భరోసా కలుగుతుందని తన అభిప్రాయం అని మంత్రి అచ్చెన్నాయుడు వ్యక్తం చేశారు. ఇప్పటికే సహజ విపత్తులతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కేంద్రం తక్షణ సహకారం అందించాలన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.












Click it and Unblock the Notifications