జగన్ సృష్టి, చంద్రబాబు సంస్కరణ - సచివాలయాలకు కొత్త పేరు, ఇక నుంచి..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్దం అవుతోంది. రాష్ట్రంలోని సచివాలయ వ్యవస్థ పై జగన్ ముద్ర లేకుండా కీలక అడుగులు వేస్తోంది. సచివాలయాల పేర్లు మార్పు పైన అభిప్రాయ సేకరణ జరుగుతోంది. ప్రభుత్వంలో మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. వార్డు, గ్రామ సచివాలయాలకు కొత్త పేరు ప్రతిపాదించిన చంద్రబాబు.. ఆ దిశగా అభిప్రాయాలు తీసుకుంటున్నారు. దీంతో, ఇప్పుడు ఈ ప్రతిపాదన పైన రాజకీయంగా చర్చ మొదలైంది.
ఏపీలో గ్రామ- వార్డు సచివాలయాల కు కొత్త పేరు రానుంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైం లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ గ్రామంలో.. అదే విధంగా మున్సిపాల్టీల్లో ప్రతీ వార్డులో సచివాలయం ఏర్పాటు చేసారు. అక్కడే అన్ని రకాల పౌర సేవలు అందించే ఏర్పాట్లు చేసారు. దాదాపు 1.50 లక్షల ఉద్యోగులను కొత్తగా నియమించారు. అదే సమయంలో వాలంటీర్ వ్యవస్థను అమలు చేసారు.

కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ల వ్యవస్థను తప్పించి .. సచివాలయాల ఉద్యోగులతోనే పెన్షన్ల పంపిణీ.. పౌర సేవలు అందిస్తోంది. అయితే, ఇప్పటికీ జగన్ ప్రతీ సందర్భంలో సచివాలయ వ్యవస్థ తాను సృష్టించిన వ్యవస్థగా చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవస్థ పేరు మార్చి.. కొనసాగించేలా ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అందులో భాగంగా తాజాగా సచివాలయ వ్యవస్థలో మార్పులు... ఉద్యోగులకు జాబ్ ఛార్టర్ ను ఖరారు చేసారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సచివాలయాల పేరు మార్పు అంశం పైన చర్చించారు. సచివాలయాలకు స్వర్ణాంధ్ర కేంద్రాలుగా మార్పు చేస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయం సేకరించారు. ప్రభుత్వంలోనూ.. కేబినెట్ లోనూ చర్చించి నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. 2019 అక్టోబర్ 2న జగన్ హయాంలో ప్రారంభమైన సచివాలయ వ్యవస్థ ఇప్పటికీ అదే పేరుతో కొనసాగుతోంది.
వైసీపీ అయితే ఇది గొప్ప పాలనాపరమైన సంస్కరణలుగా చెప్పుకుంటుంది. కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ 2047 పేరుతో ప్రణాళిక లు అమలు చేస్తోంది. ఈ సమయంలో క్షేత్ర స్థాయిలో సచివాలయ వ్యవస్థ కీలకంగా మారుతోంది. సచివాలయ సిబ్బంది ఇప్పటికే ప్రభుత్వ పథకాల అమలులో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో.. ఇప్పుడు ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ పేరు మార్పు పైన చేస్తున్న కసరత్తు పైన రాజకీయంగా చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications