Work From Home Town : ఏపీలో 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆ పైలట్ ప్రాజెక్టు...
ఐటీ ఉద్యోగులకు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ వెసులుబాటు కల్పించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో వర్క్ ఫ్రమ్ హౌమ్ టౌన్ పైలట్ ప్రాజెక్టును చేపట్టబోతోంది. ఇందుకోసం క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలపై మొదట అధ్యయనం చేసి వాటిని పరిష్కరించాలని దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన పలువురు ఉన్నతాధికారులు,కమిటీ సభ్యులతో గురువారం వర్చువల్ సమావేశం జరిగింది.
ఇంటర్నెట్,24గంటల విద్యుత్,సెక్యూరిటీ,ప్రైవసీ,డిమాండ్,సర్వే తదితర వసతుల కల్పనపై కమిటీ సమీక్ష జరిపింది. వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్తో ఉద్యోగులకు,కంపెనీలకు ఇరువురికి ప్రయోజనమని పేర్కొంది. వర్క్ స్టేషన్లకు అవసరమైన భవనాలను ఇప్పటికే గుర్తించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. వీటి నిర్వహణకు అయ్యే వ్యయంపై అంచనాలు సిద్దం చేసినట్లు చెప్పారు. కాస్ట్ టు కాస్ట్ విధానంలో వీటి అమలుకు చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు.
ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలోని ఎక్సలెన్స్ సెంటర్స్,ఈఎస్సీ సెంటర్లను సైతం కోవర్కింగ్ స్టేషన్లుగా ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. కాకినాడ,విశాఖపట్నంలలో ఉన్న ఇన్నోవేషన్ సెంటర్స్,విలేజ్ డిజిటల్ సెంటర్స్,ఇంజనీరింగ్ కాలేజీలు,కోవర్కింగ్ స్టేషన్లుగా మార్చేందుకు ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపారు. జిల్లాల్లోని ఏపీఐఐసీ భవనాలు,ఈఎస్సీలను వర్కింగ్ స్టేషన్లుగా మలిచేలా ప్రణాళికలు సిద్దం చేయాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆదేశించారు. దేశంలోనే తొలిసారిగా ఏపీలో వర్క్ ఫ్రం హోం టౌన్ విధానం అందుబాటులోకి రాబోతుందన్నారు. దీనిపై మరింత లోతుగా చర్చించేందుకు అక్టోబరు 14న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. స్వగ్రామం నుంచే ఐటీ ఉద్యోగం చేసే అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.