విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే
తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరి మాసం నుంచే ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుండి ఎండ తీవ్రత పెరుగుతూ 10, 11 అయ్యేసరికి ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అనేక జిల్లాల కేంద్రాలలో ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు.
మార్చి 16నుండి ఒంటిపూట బడులు
మధ్యాహ్నం వేళ రోడ్ల పైన జనసంచారం బాగా తగ్గిన పరిస్థితి ఉంది. ఈసారి ఎండలు బాగా మండుతున్న క్రమంలో తెలంగాణ విద్యాశాఖ ప్రస్తుతం కీలక నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రత దృష్ట్యా మార్చి 16వ తేదీ నుండి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలలో ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి పని దినమైన ఏప్రిల్ 23 వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది.

స్కూల్స్ టైమింగ్స్ ఇవే
ఈ మేరకు పాఠశాల పని వేళలను విద్యాశాఖ నిర్ణయించింది. పాఠశాలలు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పనిచేస్తాయి. ప్రభుత్వ పాఠశాలలలో 12:30 కు మధ్యాహ్న భోజనాన్ని ఇస్తారు. ప్రైవేట్ పాఠశాలలు సైతం ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ఇక మధ్యాహ్నం తరువాత ఎట్టి పరిస్థితులలోను పాఠశాలలు నిర్వహించకూడదని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎవరికి, ఎటువంటి మినహాయింపులు లేవని పేర్కొంది.
జూన్ 12న తరగతులు పునః ప్రారంభం
ఏప్రిల్ 23వ తేదీ చివరి పని దినం గాను, ఏప్రిల్ 24 నుండి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభమవుతాయని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. 2026- 27 విద్యా సంవత్సరానికి జూన్ 12న తరగతులు పునః ప్రారంభమవుతాయని పేర్కొంది. అంతేకాదు రంజాన్ మాసం కొనసాగుతున్న క్రమంలో మార్చి 19వ తేదీన పండుగ నేపథ్యంలో విద్యాశాఖ కొన్ని పాఠశాలల సమయాలలో మార్పులు చేసింది.
ఉర్దూ మీడియం స్కూల్స్ టైమింగ్స్ ఇలా
ప్రభుత్వ, ఎయిడెడ్, ఉర్దూ మీడియం పాఠశాలలు, మార్చి 15 వరకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు పనిచేస్తాయని పేర్కొంది. ఆ తర్వాత ఆ పాఠశాలలు సైతం 12:30 గంటల వరకు మాత్రమే కొనసాగుతాయని వెల్లడించింది.












Click it and Unblock the Notifications