ఏపీలో రెడ్ జోన్లపై ఇక ప్రత్యేక దృష్టి- ఎల్లుండి నుంచి స్పెషల్ ప్లాన్..
ఏపీలో ఎల్లుండి నుంచి మరిన్ని లాక్ డౌన్ సడలింపులు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. లాక్ డౌన్ మినహాయింపుల కారణంగా వైరస్ వ్యాప్తి కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టిసారిస్తోంది. ఇందులో భాగంగా రెడ్ జోన్ల నుంచి గ్రీన్, ఆరెంజ్ జోన్లకు వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన కసరత్తు చేస్తోంది. అలాగే క్వారంటైన్లలో సౌకర్యాల పెంపు, పరీక్షల వేగం పెంచడం వంటి చర్యలను చేపట్టబోతోంది.
Recommended Video
కరోనా తర్వాత రాజకీయాల్లో పెనుమార్పులు....ప్రచారం, ఎన్నికలు అంతా ఆన్ లైన్లోనే.. ?
ఏపీలో కరోనా వైరస్ నియంత్రణకు చేపడుతున్న చర్యలతో పరిస్దితి అదుపులోనే ఉందని భావిస్తున్న ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో మరింత వేగం పెంచాలని భావిస్తోంది. కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్ కిట్లతో పరీక్షల వేగం మరింత పెంచాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ క్రమంలో కేసుల సంఖ్య పెరిగినా ఆందోళన అవసరం లేదని చెబుతోంది. అలాగే రెడ్ జోన్ల సంఖ్యను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వైద్యారోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. అవసరాన్ని బట్టి రెడ్ జోన్లకు ప్రత్యేక అధికారులను పంపడం ద్వారా పరిస్ధితిని పూర్తిగా నియంత్రణలోకి తీసుకురావాలని భావిస్తోంది.
ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాల్లో అందిస్తున్న సౌకర్యాలపై ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో వీటిపై తక్షణం దృష్టిపెట్టాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. కరోనా అనుమానితులుగా క్వారంటైన్లకు తీసుకొచ్చాక అక్కడ ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఇక వీటిపై ప్రత్యేక దృష్టి సారించనుంది. అలాగే వీరికి త్వరగా పరీక్షలు నిర్వహించి ఇళ్లకు పంపడంపైనా అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు.