సుప్రీంకోర్టులో అమరావతి కేసు - ఏపీ ప్రభుత్వం కీలక అడుగు..!!
సుప్రీంలో అమరావతి కేసు విచారణ పై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది.
ఏపీలో ఇప్పుడు రాజధాని వ్యవహారం కీలకంగా మారుతోంది. ప్రతం రాజధాని కేసులు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నాయి. ఎన్నికలకు సిద్దం అవుతున్న ప్రభుత్వం రాజధాని అంశం త్వరగా తేలాలని కోరుకుంటోంది. విశాఖ నుంచి పాలన ప్రారంభించాలనేది అధికార పార్టీ నేతల ఆలోచన. ఏపీ హైకోర్టు అమరావతికి అనుకూలంగా ఇచ్చిన తీర్పు పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ కు వెళ్లింది. విచారణ కొనసాగిస్తున్న సుప్రీంకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అమరావతి నిర్మాణం పై హైకోర్టు నిర్ణయించిన కాల పరిమితితో పాటుగా మరి కొన్ని అంశాలపైన స్టే ఇచ్చింది. తదుపరి విచారణకు సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది. ఆ తరువాత విచారణ జరగలేదు. ఇప్పుడు ఇదే అంశం పైన ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీంను ఆశ్రయించింది.
సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణ వేగవంతం చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఇప్పటికే కోరింది. అమరావతి కేసులను విచారణ జాబితాలో త్వరగా చేర్చాలని సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి గత సోమవారం జస్టిస్ జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. దీంతో, ఈ నెల 28న విచారణకు నిర్ణయించారు. దీని పైన ఏపీ ప్రభుత్వం మరోసారి నేడు సుప్రీం ముందు ప్రస్తావించేందుకు సిద్దమైంది. నేడు కోర్టు ప్రారంభం కాగానే జస్టీస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అసనుద్దిన్ అమానుల్ల ధర్మాసనం ముందు ఏపీ ప్రభుత్వం తమ అభ్యర్ధన ప్రస్తావించనుంది. ఇప్పుడు ధర్మాసనంలో సభ్యుడిగా వచ్చిన జస్టిస్ అమానుల్లా గతంలో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా వ్యవహరించారు.

సుప్రీంకోర్టులో విచారణ పూర్తయితే, తీర్పు తమకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని ఏపీలోని అధికార పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. అందులో భాగంగానే అమరావతి కేసుల విచారణ వేగంగా పూర్తి కావాలని కోరుకుంటోంది. ఈ నెలలోనే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. సుప్రీంలో విచారణ..రాజధానుల పైన స్పష్టత వస్తే దీనికి అనుగుణంగా మరోసారి అసెంబ్లీలో రాజధానుల బిల్లు ప్రతిపాదించాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. సుప్రీంలో కేసు పెండింగ్ లో ఉన్న సమయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉండదనే అభిప్రాయం ఉంది. దీంతో..సుప్రీంను మరోసారి అభ్యర్ధించటం ద్వారా కేసును వేగంగా విచారణ పూర్తయ్యే చూడాలనేది ప్రభుత్వం ఉద్దేశం. దీంతో ఈ రోజు మరోసారి సుప్రీంలో ఏపీ న్యాయవాది కేసు విచారణ వేగవంతం చేయాలని అభ్యర్దించేందుకు సిద్దమయ్యారు.












Click it and Unblock the Notifications