ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీ -3జిల్లాలకు కొత్త కలెక్టర్లు, అంతటా జేసీల మార్పు -గంధం చంద్రుడికి ప్రమోషన్
కరోనా వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఎత్తున ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేసింది. మొత్తం మూడు జిల్లాలకు కలెక్టర్లను మార్చేయగా, దాదాపు రాష్ట్రమంతటా జాయింట్ కలెక్టర్లకు స్థానచలం కలిగింది. వినూత్న పనితీరుతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుకు ప్రమోషన్ దక్కింది. కరోనా కట్టడి చర్యల్లో తనదైన ప్రత్యేకత కనబర్చిన కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్కు కూడా పదోన్నతి లభించింది.

సీఎస్ దాస్ ఆదేశాలు..
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ ల బదిలీలకు సంబంధించి చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలకు కొత్త కలెక్టర్లు రానున్నారు. అలాగే అన్ని జిల్లాల్లోనూ జాయింట్ కలెక్టర్లను బదిలీ చేశారు. కరోనా పరిస్థితుల నిర్వహణ, రాజకీయ అంశాలు, జగన్ ప్రతిష్టాత్మక పథకాల అమలు తదితర అంశాల నేపథ్యంలో ఐఏఎస్ ల బదిలీలకు సంబంధించి సీఎస్ ఆదేశాల్లోని వివరాల ప్రకారం..

ఆ ఇద్దరికీ ప్రమోషన్..
అనంతపురం జిల్లా కలెక్టర్ గా నాగలక్ష్మి నియమితులయ్యారు. ఇప్పటిదాకా అక్కడ పనిచేసిన గంధం చంద్రుడుకు ప్రమోషన్ దక్కింది. ఇకపై ఆయన సీఎం జగన్ మానసపుత్రికలాంటి 'ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల'కు సెక్రటీగా సేవలందిస్తారు. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ను ప్రమోషన్పై మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ను కృష్ణా జిల్లా కలెక్టర్గా, ఎల్.ఎస్ బాలాజీరావును శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా నియమించారు. ఇక, పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా గోపాలకృష్ణ రోణంకి, ఏపీ ఆగ్రోస్ ఎండీగా ఎస్ కృష్ణమూర్తి నియమితులయ్యారు.
Recommended Video

ఏపీ వ్యాప్తంగా జేసీల బదిలీ..
ఇక, జాయింట్ కలెక్టర్ విషయానికొస్తే.. అనంతపురం జాయింట్ కలెక్టర్గా టి.నిశాంతి, ప్రకాశం జిల్లా జేసీగా విశ్వనాథం, కడప జేసీగా ధ్యానచంద్ర, తూర్పుగోదావరికి జాహ్నవి, కర్నూలు జేసీగా ఎన్.మౌర్య, కృష్ణా జేసీగా ఎస్.ఎన్.అజయ్కుమార్, గుంటూరు జేసీగా అనుపమా అంజలి, నెల్లూరుకు విదేహ్ ఖేర్, పశ్చిమగోదావరికి ధనుంజయ్, విశాఖ జేసీగా కల్పనా కుమారి, విజయనగరానికి మయూర్ అశోక్, శ్రీకాకుళం జేసీగా హిమాన్షు కౌశిక్, చిత్తూరు జేసీగా ఎస్. వెంకటేశ్వర్ నియమితులయ్యారు.












Click it and Unblock the Notifications