ఏపీలో ప్రైవేటు చేతికి కరోనా టెస్టులు- ఫలితాల తారుమారు-సర్కార్ సీరియస్..
తెలంగాణలో ప్రైవేటు ఆస్పత్రుల్లో నిర్వహిస్తున్న కరోనా టెస్టులు, చికిత్సలపై రోగుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న తరుణంలో ఏపీలోనూ దాదాపు అలాంటి పరిస్ధితే కనిపిస్తోంది. తాజాగా కొన్ని ప్రైవేటు ల్యాబ్ లలో నిర్వహించిన కరోనా టెస్టుల ఫలితాల్లో తేడాలు గుర్తించిన ప్రభుత్వం వారిపై సీరియస్ అయింది. తప్పుడు ఫలితాలు ఇస్తే లైసెన్స్ ల రద్దుతో పాటు కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం ప్రైవేటు ల్యాబ్ లను హెచ్చరించింది.
కరోనా వ్యాప్తి మొదలయ్యాక ప్రభుత్వం వివిధ కోవిడ్ 19 ఆస్పత్రులతో పాటు కరోనా కేర్ సెంటర్లలో నిర్వహిస్తున్న చికిత్సలపై అక్కడకక్కడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా స్ధూలంగా ధర్మాసుపత్రులే జనానికి కష్టకాలంలో దిక్కయ్యాయన్న చర్చ సాగింది. తాజాగా ప్రభుత్వం కరోనా వ్యాప్తి భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ టెస్టులకు, చికిత్సలకూ అవకాశం కల్పించింది. వాటికి ఎంత వసూలు చేయాలన్న దానిపైనా ప్రత్యేకంగా మార్గదర్శకాలు ఇచ్చింది. ఇంత వరకూ బాగానే ఉన్నా ప్రైవేటు ల్యాబ్ ల్లో జరుగుతున్న కరోనా టెస్టుల ఫలితాలపై తాజాగా అనుమానాలు మొదలయ్యాయి. పలుచోట్ల కరోనా ఫలితాల్లో తేడాలు కనిపించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
ప్రైవేటు ల్యాబ్ ల్లో నిర్వహించిన కరోనా టెస్టుల్లో అక్కడక్కడ ఫలితాల్లో తేడాలు గమనించినట్లు డిప్యూటీసీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని ఇవాళ వెల్లడించారు. అయితే మరోసారి తప్పుడు రిపోర్టులు వచ్చినట్లు తేలితే సదరు ల్యాబ్ ల లైసెన్స్ లు రద్దు చేసేందుకు కూడా వెనుకాడబోమని ఆళ్లనాని హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో టెస్టుల ఫలితాలు ఆలస్యమవుతున్నట్లు చెబుతున్న ప్రభుత్వం.. ప్రైవేటుకు ఇవ్వడం ద్వారా ఫలితాల తారుమారుపై విమర్శలు వ్యక్తం కావడంతో ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది.