ఏపీ 12న మరో సంక్షేమ పథకం: రెండు బిగ్ కార్పొరేట్ సంస్థల సహకారం.. కీలక ఒప్పందాలతో
అమరావతి: రాష్ట్రంలో మరో సంక్షేమ పథకం అమల్లోకి రానుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలను ఆర్థికంగా ఆదుకోవడానికి అందించడానికి ఉద్దేశించిన వైఎస్సార్ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 12వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఒక్కొక్కరికి ఏటా 18,750 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. నాలుగేళ్ల కాలంలో మొత్తం 75 వేల రూపాయలు వారికి అందేలా ఈ పథకానికి రూపకల్పన చేసిన ప్రభుత్వం.
48 గంటల డెడ్లైన్: లాజిక్ లాగుతోన్న వైసీపీ: స్థానిక ఎన్నికలకు కరోనా అడ్డు..అసెంబ్లీ రద్దు ఎలా?
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 24 లక్షల నుంచి 25 లక్షల మంది పేద మహిళలు లబ్ధి పొందుతారు. వచ్చే నాలుగేళ్ల పాటు ఈ పథకం అమల్లో ఉంటుంది. దీనికోసం 20 వేల కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. దీనికి అనుగుణంగా బడ్జెట్ వనరులను సమకూర్చుకుంటోంది. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ నిర్వహించిన ఎన్నికల ప్రచార సమయంలో వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రస్తావించారు.
పేద మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడానికి, వారికి ఆర్థిక స్వయం ప్రతిపత్తిని కల్పించడానికీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని ప్రారంభిస్తానని భరోసా ఇచ్చారు. దీనికి అనుగుణంగా ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ పథకం అమలులో రెండు బిగ్ కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వానికి సహకరించనున్నాయి. దీనికోసం ఇదివరకే ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు చేశాయి.
More power to our Hon. CM @ysjagan Garu’s vision. Thank you Mr. Sanjiv Mehta, CEO & MD, @HUL_News for joining hands to support YSR Cheyutha Scheme. Lives of 25 lakh women will be transformed through this initiative. This is real upliftment for the DWCRA groups and women in AP.
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 4, 2020
హిందుస్తాన్ యునిలివర్ లిమిటెడ్ (హెచ్యుఎల్), ప్రొక్టర్ అండ్ గ్యాంబెల్ (పీఅండ్జీ) సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. స్వయం సహాయక బృందాలు రూపొందించిన వస్తువులను కొనుగోలు చేయడం, వాటికి మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించడం, ప్రచార కార్యక్రమాలను రూపొందించడానికి ఈ రెండు సంస్థలు ముందుకొచ్చాయి. హెచ్యుఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా తరఫున రామకృష్ణారెడ్డి, పీ అండ్ జీ తరఫున జోసెఫ్ వర్కీ..గ్రామీణ పేదరిక నిర్మూలా సొసైటీ (సెర్ప్)తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
వైఎస్సార్ చేయూత పథకానికి సహకారం అందిస్తున్నందున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వీ విజయసాయి రెడ్డి వారికి కృతజ్ఙతలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. పేదరిక నిర్మూలన, మహిళలకు ఆర్థిక స్వావలంబనను కల్పించడానికి ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలకు ఈ రెండు కార్పొరేట్ సంస్థలు సహకరించడం మరింత ఊతమిచ్చిట్టవుతుందని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలో మహిళల ఆర్థిక స్థితిగతులను సమూలంగా మార్చివేయడానికి సెర్ప్తో కుదర్చుకున్న ఒప్పందాలు ఉపకరిస్తాయని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.