విజయసాయిరెడ్డి నియామకం రద్దు: జగన్ ప్రభుత్వంలో..ఎందుకిలా జరిగింది: మోదుగులకు ఛాన్స్..!
జగన్ ప్రభుత్వంలో విజయసాయిరెడ్డి నియామకం రద్దు అయింది. పార్టీ ప్రధాన కార్యదర్శి..పార్లమెంటరీ పార్టీ నేత.. రాజ్య సభ సభ్యుడు అయిన విజయ సాయిరెడ్డిని ఢిల్లీలో ఏపి ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు. అయితే, తాజాగా ఆయన నియామక ఉత్తర్వులు రద్దు చేస్తూ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. విజయ సాయిరెడ్డి నియామకానికి సాంకేతిక కారణా లు అడ్డుగా ఉన్న కారణంగానే జీవో రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఇదే నియామకం సమయంలో ఆ మాత్రం అవగాహన లేకుండా ఎలా నిర్ణయం తీసుకున్నారో అధికారులే చెప్పాలి. ఇక, ఆయన స్థానంలో మాజీ ఎంపి మోదుగుల వేణుగోపాలరెడ్డికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.
విజయ సాయిరెడ్డి నియామకం రద్దు
జగన్ ప్రభుత్వంలో అవగాహన లోపం స్పష్టంగా బయట పడింది. జాతీయ రాజకీయాల్లో ఇమేజ్ దక్కించుకుంటున్న వేళ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఇబ్బంది కర వాతావరణం ఎదురైంది. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా విజయ సాయి రెడ్డిని నియమిస్తూ గత నెల 22న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఆయన నియామకం చెల్లదని సాంకేతికంగా ఇబ్బందులు ఉన్నాయని అధికారులు తాజాగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఒక లాభదాయక పదవిలో ఉన్న సమయంలో మరో పదవి ఇవ్వకూడదనే విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించారు. నియామకం సమ యంలోనే ఇటువంటి అంశాలను వివరించకుండా..ఇప్పుడు నియామకం పూర్తయిన పదిహేను రోజులకు వివరణ ఇవ్వటం ద్వారా అధికారుల అవగాహన రాహిత్యమా..లేక నిర్లక్ష్యమా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీని పైన ఏపీ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. విజయసాయిరెడ్డి నియమాకాన్ని రద్దు చేస్తూ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఎంపీగా ఉంటూ సాధ్యం కాదు..
విజయ సాయిరెడ్డి వైసీపీ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నా పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు. ఆయనకు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించాలనే నిర్ణయం జగన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని తన పేషీ అధికారు లకు చెప్పి ఉత్తర్వులు ఇవ్వమని సూచించారు. ఆ సమయంలోనూ అనుభవం ఉన్న ఆ అధికారులు సైతం ఎదుర య్యే ఇబ్బందులను వివరించలేదు. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు జీవో జారీ చేసారు. అయితే, ఒక వ్యక్తి ఎంపీగా ఉంటూ జీతం తీసుకుంటున్న సమయంలో..మరో అధికారిక పోస్టులో ఉంటూ రెండో వేతనం పొందటానికి ఎంపీకి అవకాశం ఉండదని..రెండు లాభదాయక పదవుల్లో ఉండకూడదనే విషయం తెర మీదకు వచ్చింది. దీంతో.. ఆయన నియామకాన్ని రద్దు చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసారు. సాయిరెడ్డికి ఏపీ ప్రభుత్వ ప్రతినిధి హోదాలో ఏపీ భవన్లో చాంబర్ సైతం ఏర్పాటు చేసారు. కానీ, ఆయన ఇప్పటి వరకు బాధ్యతలు మాత్రం స్వీకరించలేదు.
మోదుగులకు అవకాశం..
ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఎంపీ విజయసాయిరెడ్డిని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటంతో ఇక ఇప్పుడు ఈ పోస్టులో ఎవరిని నియమిస్తారనే చర్చ మొదలైంది. వైసీపీ నుండి 22 మంది ఎంపీలు.. ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నా..వారిలో ఎవరికీ ఈ పదవి ఇవ్వటానికి అవకాశం లేదు. దీంతో.. గతంలో ఎంపీగా పని చేసి అటు డిల్లీ వ్యవహారాల్లోనూ..ఇటు రాష్ట్ర పరిపాలన మీద అవగాహన ఉన్న మాజీ ఎంపీ..ఎమ్మెల్యే అయిన మోదుగుల వేణు గోపాల్ రెడ్డి పేరు పరిశీలనకు వచ్చినట్లు సమాచారం. ఆయన తాజా ఎన్నికల్లో గుంటూరు నుండి ఎంపీగా పోటీ చేసి టీడీపీ అభ్యర్ది గల్లా జయదేవ్ మీద అయిదే వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తిరస్కరణతో టీడీపీ ఎంపీ గెలిచారంటూ కోర్టులో కేసు కొనసాగుతోంది. దీంతో.. లోక్సభ సభ్యుడిగా.. ఏపీ ఎమ్మెల్యేగా పని చేసి అనుభవం ఉన్న మోదుగుల వేణు గోపాల రెడ్డిని ఇప్పుడు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.