ఏపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరు-ఫస్ట్ ప్రయార్టీలో తేలని ఫలితాలు-రెండో ప్రయార్టీలో లెక్కింపు..
ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఏపీ పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు దాదాపుగా తేలిపోయినా, అంతిమ ఫలితం తేల్చేందుకు రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించక తప్పడం లేదు.
అమరావతి : ఏపీలో తాజాగా మూడు నియోజకవర్గాలకు జరిగిన పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. పశ్చిమ, తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గాలకు జరిగిన ఈ ఎన్నికల కౌంటింగ్ నిన్న ప్రారంభమైంది. అయితే ఇవాళ ఫలితాల సరళి అర్ధమైనా తుది ఫలితం మాత్రం ఇంకా తేలలేదు.
తూర్పు రాయలసీమగా పేర్కొంటున్న ప్రకాశం - నెల్లూరు - చిత్తూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇందులో మొత్తం పోలైన ఓట్లు 2,69,339 కాగా.. చెల్లని ఓట్లు 20,979గా నిర్దారించారు. మిగిలిన 2,48,360 ఓట్లకు జరుగుతున్న కౌంటింగ్ లో విజేతగా నిలిచేందుకు 1,24,181 ఓట్లు అవసరం కాగా.. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్ధి కంచర్ల శ్రీకాంత్ 1,12,514 ఓట్లు సాధించారు. తర్వాతి స్దానంలో వైసీపీ అభ్యర్ది పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి 85,252 ఓట్లు మాత్రమే సాధించారు. అయితే ఇద్దరికీ గెలుపుకు కావాల్సిన 50 శాతం ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు.

అలాగే పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధి వెన్నపూస రవీంద్రరెడ్డి ఆరో రౌండ్ ముగిసేసరికి 56110 ఓట్లు సాధించారు. అలాగే టీడీపీ అభ్యర్ధి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి 54091 ఓట్లు సాధించారు. దీంతో వైసీపీ అభ్యర్ధి కేవలం
1971 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడా ఫలితం రెండో ప్రాధాన్యత ఓటు ఆధారంగా తేలే అవకాశముంది. అటు ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్ధానంలో టీడీపీ అభ్యర్ధి వేపాడ చిరంజీవిరావు 82958 ఓట్లు సాధించగా.. వైసీపీ అభ్యర్ధి సీతంరాజు సుధాకర్ కు 54,379 మాత్రమే వచ్చాయి. అయినా గెలుపు కోసం చిరంజీవి రావుకు 11551 ఓట్లు అవసరం ఉండటంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు.












Click it and Unblock the Notifications