ఏపీలో వాలంటీర్ వ్యవస్థ రద్దుకు వైసీపీ ఎంపీ రఘురామ పోరు -ప్రధాని మోదీకి ఫిర్యాదు -తిరుపతి నుంచే షురూ
సొంత పార్టీపై, అధినేత సీఎం జగన్పై తీవ్రస్థాయి విమర్శలు, ఆరోపణలు చేస్తోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో సంచలనానికి పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతోన్న గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థ రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ, సదరు వ్యవస్థల రద్దు దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీ ఓ లేఖ రాశారు. ఏపీ సహా వివిధ రాష్ట్రాల్లో అమలవుతోన్న ఉచిత పథకాలపైనా రఘురామ ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..

వాలంటీర్లు రాజ్యాంగ విరుద్ధం
ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తులను గ్రామ/వార్డు వలంటీర్లుగా నియమించారని, ఈ మేరకు తీసుకొచ్చిన జీవో 104 నూటికి నూరుశాతం రాజ్యాంగ విరుద్ధమైనదని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులిస్తూ, పార్టీ పనుల కోసం చేపట్టిన ఇలాంటి రాజ్యాంగ, చట్ట వ్యతిరేక నియామకాలపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని మోదీకి నరసాపురం ఎంపీ ఫిర్యాదు చేశారు. సుపరిపాలన పేరుతో గాంధీ జయంతినాడు(2019లో) ప్రారంభమైన ఈ వాలంటీర్ వ్యవస్థ నిజానికి గ్రామ పరిపాలనా వాతావరణాన్ని కలుషితం చేస్తున్నదని, ఇంతటి అరాచక, చట్టవ్యతిరేక వ్యవస్థపై తక్షణమే చర్యలు తీసుకునేలా కేంంద్రం ఉపక్రమించాలని ఎంపీ తన లేఖలో కోరారు.

ఏపీలో గ్రామాలు అస్తవ్యస్తం
వాలంటీర్లు రాజ్యాంగ, చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తూ.. గ్రామ పరిపాలనను అస్తవ్యస్తంగా మార్చేశారని, గ్రామాలలో కులాలు, వర్గాల మధ్య, ఘర్షణలకు కేంద్రబిందువుగా మారుతున్నారని, ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని వాలంటీర్లపై ఎంపీ రఘురామ ఆరోపణలు చేశారు. అధికార పార్టీకి సానుకూలంగా లేకుంటే.. రేషన్ కూడా ఇవ్వబోమంటూ ప్రజలను వాలంటీర్లు భయపెడుతున్నారని, దీంతో గ్రామ పరిపాలన పూర్తిగా స్తంభించిపోతోందని, వాలంటీర్ల వల్ల పల్లెల్లో కొత్తకొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయని, ప్రశాంతత కొరవడిందని ఎంపీ తెలిపారు.

దేశంలో ఎక్కడా లేదు..
''సుపరిపాలన సాకుతో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తెచ్చి, అధికార వైసీపీకి విధేయులను నియమించుకుని గ్రామ పరిపాలనా వాతావరణాన్ని కలుషితం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం నియమించుకున్న వాలంటీర్లకు ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న నిధుల నుంచి జీతాలిస్తున్నారు. ఈ వాలంటీర్లంతా అధికార దుర్వినియోగంతో స్థానిక ఎన్నికల్లో ఓటర్లను వ్యూహాత్మకంగా ప్రభావితం చేశారు. అధికార పార్టీకి ఓటు వేయకపోతే సరుకుల డోర్ డెలివరీ నిలిచిపోతుందని ప్రజలను బెదిరించారు. దేశంలో మరెక్కడా ఈ పరిస్థితి లేదు..'' అని రఘురామ లేఖలో పేర్కొన్నారు.

వాలంటీర్లను కట్టడి చేయండి..
గ్రామాల అభ్యుదయం, స్వచ్ఛ పరిపాలనకు, ప్రశాంతతకు, కుల, వర్గ, మత సామరస్యానికి వాలంటీర్ల వ్యవస్థ ఒక అడ్డుగోడలా తయారైన వాలంటీర్ల వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం తగిన రీతిలో తక్షణమే చర్యలు తీసుకోవాలని, వాలంటీర్ల ఆగడాలు, అక్రమాలు, రాజ్యాంగ విరుద్ధమైన జోక్యాలను కట్టడి చేయాలని ప్రధాని మోదీకి వైసీపీ ఎంపీ విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో, ఏపీ సహా వివిధ రాష్ట్రాల్లో అమలవుతోన్న ఉచిత పథకాలపై నియంత్రణ కోరుతూ రఘురామ మరో లేఖను కూడా రాశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాల కారణంగా ఖజానాలు ఖాళీ అయి, అప్పుల్లో కూరుకుపోతున్నాయని, ఓట్ల కోసం అభివృద్ధికి కేటాయించాల్సిన నిధులను ఉచిత పథకాలకు తరలిస్తున్నారని, కొత్త చట్టం ద్వారా ఉచిత పథకాలపై నియంత్రణ తీసుకురావాలని కోరుతూ మోదీకి రఘురామ లేఖ రాశారు. ఇదిలా ఉంటే,

తిరుపతిలో వాలంటీర్లపై కేంద్రం నిఘా
ఏపీలో గ్రామ/వార్డు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసేదిశగా ఆలోచన చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాసిన సమయానికి అటు ఇటుగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సైతం ఇదే వాలంటీర్ వ్యవస్థను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ కోసం నెలకు రూ.310 కోట్ల ప్రజాధనాన్ని చేస్తున్నారని, జగన్ సర్కారు తెచ్చిన ఈ వాలంటీర్ల వ్యవస్థ ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకు విఘాతం కలిగించేలా పని చేసిందని సోము ఆరోపించారు. గత అనుభవాల దృష్ట్యా తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో వాలంటీర్లపై పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల బృందాన్ని నియమించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, సదరు బృందాలు.. వాలంటీర్ల వ్యవస్థపై కన్నేసి ఉంచుతాయని సోము తెలిపారు. ఏపీ బీజేపీ చీఫ్, వైసీపీ ఎంపీల ఫిర్యాదులపై కేంద్రం స్పందించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications