స్టూడెంట్స్కు జగన్ సర్కార్ గుడ్న్యూస్: ఒంటిపూట బడులు ఎప్పట్నుంచంటే: కొత్త టైమ్ టేబుల్ ఇదే
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు తీపి కబురు వినిపించింది. మండుటెండల్లో పన్నీటిజల్లులాంటి సమాచారం అది. వేసవి కాలం ప్రారంభంలోనే ఎండ తీవ్రత అదర గొడుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం లక్షలాది మంది విద్యార్థులకు ఊరట కలిగించేదే. రోజురోజుకు ముదురుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం.. ఒంటిపూట బడుల షెడ్యూల్ను ఖరారు చేసింది. కొద్దిసేపటి కిందటే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ షెడ్యూల్ను విడుదల చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి.
ఒంటిపూట బడుల విధానం 1 నుంచి 10వ తరగతి వరకు వర్తిస్తుందని ఆదిమూలపు సురేష్ తెలిపారు. విద్యార్థులకు ఒక్కపూటే తరగతులు ఉంటాయని స్పష్టం చేశారు. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే తరగతులను నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు ఆదేశాలను జారీ చేసినట్లు చెప్పారు. 12.30 గంటల తరువాత మధ్యాహ్న భోజనాన్ని వడ్డిస్తారని చెప్పారు. మధ్యాహ్న భోజనం చేసిన తరువాత విద్యార్థులు ఇళ్లకు వెళ్తారని అన్నారు. రాష్ట్రంలో రోజురోజుకూ ఎండలు ముదురుతున్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒంటిపూట బడులను నిర్వహించనున్నామని చెప్పారు.
ఎండ తీవ్రతతో పాటు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల పెరుగుదల కూడా దీనికి ఓ కారణమైందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, మున్సిపల్, ప్రైవేటు, ఎయిడెడ్/అన్ ఎయిడెడ్ పాఠశాలలన్నింటికీ ఈ విధానం వర్తిస్తుందని అన్నారు. ఈ ఆదేశాలను అన్ని పాఠశాలలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని ఆదిమూలపు సురేష్ సూచించారు. పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల పాఠశాలల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ ప్రొటోకాల్ను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు.