జగన్ చేతికి 'అమరావతి' అస్త్రం!: సింగపూర్ మెలికకు బాబు నో, లండన్వైపు చూపు
విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగే వరకు రాజధాని నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పిన విదేశీ కంపెనీలు ఇప్పుడు మెలిక పెడుతున్నాయని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే అవి తమ నిజస్వరూపాన్ని బయటపెడుతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అమరావతి నిర్మాణంలో భాగస్వాములు అయ్యేందుకు ప్రధానంగా సింగపూర్, జపాన్ కంపెనీలు ముందుకు వచ్చాయి. అయితే సింగపూర్ ప్రతినిధులు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. శంకుస్థాపనకు ముందే జపాన్ అమరావతి గురించి భారత విదేశీ వ్యవహారాల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది.
తాజాగా లండన్ కూడా అమరావతి నిర్మాణానికి నిధులు సమీకరిస్తామని చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. అమరావతి నిర్మాణానికి కావాల్సిన మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్కు అప్పగించిన విషయం తెలిసిందే.
మాస్టర్ ప్లాన్ను కూడా సింగపూర్ ఉచితంగా తయారు చేసిందని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. అయితే, లోపాయికారీ విషయం మరొకటి ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం చంద్రబాబు ప్రభుత్వం రూ.12 కోట్ల వరకూ ఖర్చు చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది.
సీడ్ క్యాపిటల్ ప్లాన్ను గత ఏడాది జూలైలోనే సింగపూర్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. స్విస్ ఛాలెంజ్ విధానంలో రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని సింగపూర్ మంత్రిని చంద్రబాబు అప్పుడే కోరారు. సీడ్ క్యాపిటల్ ప్లాన్లో కొన్ని సవరణలు చేయాలని కూడా చెప్పారు.
ఆ తర్వాత నుంచి సింగపూర్ ప్రతినిధులు కొన్ని షరతులు విధిస్తూ వస్తున్నారు. కోర్ క్యాపిటల్లో 30 కి.మీ. పరిధి అంతా తమ అధీనంలోనే ఉండాలని, అక్కడ పనులన్నీ తామే చేయాలని సింగపూర్ ప్రతినిధులు మొదటి షరతు విధించారు.
అమరావతి
అంతేకాదు, ప్రభుత్వం మారినా 25 ఏళ్లపాటు అమల్లో ఉండేలా ఒప్పందం చేసుకోవాలని సింగపూర్ ప్రతిపాదించింది. దీనికి ప్రభుత్వం ససేమీరా అంది. ఈ నేపథ్యంలో గ్లోబల్ టెండర్లలను పిలిచి, ఎవరు తక్కువ కోట్ చేస్తే, వారికే ఆయా పనులు అప్పగించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది.
అమరావతి
మరో విషయం ఏమంటే... రాజధాని నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకోవడం లేదు. అనుబంధ సంస్థ మాత్రమే ఆసక్తితో ఉంది. మాస్టర్ ప్లాన్ ఇచ్చిందీ ఆ సంస్థనే. పూర్తిస్థాయి మాస్టర్ ప్లాన్ కూడా ప్రభుత్వం చేతికి రాలేదు.
అమరావతి
మరోవైపు, జపాన్ ప్రభుత్వం అమరావతి గురించి మన దేశ విదేశీ వ్యవహారాల శాఖ నుంచి వివరాలు సేకరించింది. అమరావతి గురించి పూర్తి స్థాయిలో విదేశీ వ్యవహారాల శాఖ నివేదిక ఇవ్వకపోవడం వలనే ఆ దేశ ప్రధాని శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కాలేదని సమాచారం.
అమరావతి
సీఎం చంద్రబాబు ఇటీవల లండన్లో పర్యటించారు. ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కాన్క్లేవ్లో పాల్గొన్నారు. రాజధాని నిర్మాణానికి లండన్ సహకారాన్ని కోరారు. రాజధాని నిర్మాణానికి నిధులు సమీకరిస్తామని లండన్ చెప్పడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
అమరావతి
చంద్రబాబు ప్రభుత్వం కూడా సింగపూర్, జపాన్ దేశాలను రాజధాని నిర్మాణంలో భాగస్వాములను చేయడం కన్నా, ఆర్థికంగా పటిష్ఠంగా ఉన్న అమెరికా, లండన్లను తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోందని అంటున్నారు.
అమరావతి
ఇక, చంద్రబాబు రాజధాని కోసం కేంద్రం నుంచి నిధులను రాబట్టే ప్రయత్నాలు చేయడం కంటే నిర్మాణంలో విదేశీ సంస్థలను ఎలా భాగస్వాములను చేయాలనే దానిపై దృష్టి సారిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇది చర్చనీయాంశమవుతోంది.
అమరావతి
ప్రభుత్వం తీసుకు వచ్చిన కంపెనీలు అంతర్గత అజెండాను బయట పెట్టడంతో అమరావతి నిర్మాణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజధాని నిర్మాణంపై విదేశీ కంపెనీల మెలిక, ఆలస్యం ప్రతిపక్ష నేత వైయస్ జగన్కు ఆయుధంగా మారే అవకాశం లేకపోలేదంటున్నారు.